అఖండ విజయం సాధించాక తొలిసారి పర్యటించనున్న నిశ్చయ ముఖ్యమంత్రి
ఇడుపులపాయలో వైఎస్కు నివాళులు
కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం
స్వయంగా పర్యవేక్షిస్తున్న హరికిరణ్
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల:ఎన్నికల్లో అఖండ విజయం సాధించాక తొలిసారి ఏపీ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో సీట్లలోనే కాదు మెజారిటీలోనూ రికార్డుల మోత మోగించిన ఆయన పర్యటనపై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన ప్రకటన ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 8.30గంటలకు తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో కడప వస్తారు. రోడ్డు మార్గాన కడప పెద్ద దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్లో బయలుదేరి పులివెందులలోని ధ్యాన్చంద్ క్రీడా మైదానంలో దిగుతారు. రోడ్డు మార్గాన పులివెందుల సీఎస్ఐ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అక్కడ నుంచి హెలికాఫ్టర్లో ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి ఆశీర్వాదం పొంది ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. తిరిగి హెలికాప్టర్లోకడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరుతారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
రేపు వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పులివెందులకు రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యవేక్షించారు. సోమవారం పులివెందులలోని ధ్యాన్చంద్ క్రీడా మైదానం సమీపంలో ఉన్న హెలిప్యాడ్ను ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్, విజిటర్స్ ప్రాంతం తదితర ఏర్పాట్లకు అధికారులకు సూచనలు చేశారు. పులివెందుల సీఎస్ఐ చర్చి వద్ద ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. భాకరాపురంలోని వైఎస్ జగన్ ఇంటి వద్ద ఏర్పాట్లను కూడా కలెక్టరు పరిశీలించారు. వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్ల గురించి వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్సార్ ఫౌండేషన్ చైర్మన్ జనార్థన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్, కడప భరత్రెడ్డి తదితరులతో ఆయన చర్చించారు. పోలీసు, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతోపాటు మున్సిపల్ కమిషనర్ మునికృష్ణారెడ్డి, తహసీల్దార్ మునాఫ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గండిలో ఏర్పాట్ల పరిశీలన
చక్రాయపేట: నవ్యాంద్రకు రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గండి అంజన్నను దర్శించుకోనున్నారు. ఏర్పాట్లపై జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులరెడ్డి,పులివెందుల డీఎస్పీ నాగరాజు,సీఐ రామకృష్ణడులు సోమవారం సాయంత్రం గండి వచ్చారు. ఆలయ సహాయ కమిషనర్ గురుప్రసాద్ ,ప్రధాన అర్చకుడు కేసరి స్వామిని అడిగి తెలుసుకొన్నారు. వారికి సూచనలు అందజేశారు.