బొత్స కుటుంబంలో వివాహ వేడుకకు హాజరైన వైఎస్‌ జగన్‌

28 Apr, 2019 03:56 IST|Sakshi
నూతన వధూవరులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో బొత్స సత్యనారాయణ కుటుంబం

నూతన వధూవరులకు ఆశీర్వాదం

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విశాఖ నగరానికి విచ్చేశారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పలనరసయ్య కుమార్తె యామిని సింధూకి, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు కుమారుడు రవితేజతో రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో శనివారం అర్ధరాత్రి తర్వాత 3.42 గంటలకు వివాహం జరగనున్న సందర్భంగా రాత్రి రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

ఈ వేడుకలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు, శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు వైఎస్‌ జగన్‌ అభివాదం చేశారు. అక్కడ నుంచి సాయిప్రియా రిసార్ట్స్‌కు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఎయిర్‌ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు.

వైఎస్‌ జగన్‌తో పాటు నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో పార్టీ ఎంపీ  విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలశౌరి, బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ, కిల్లి కృపారాణి, పెన్మత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి, దాడి వీరభద్రరావు, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ సిటీ, రూరల్‌ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, శరగడం అప్పలనాయుడు, పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు