వచ్చే నెలలో సీఎం పర్యటన

27 Jun, 2020 12:15 IST|Sakshi
ఆడిటోరియం మ్యాప్‌ను పరిశీలిస్తున్న విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

వేంపల్లె : వచ్చే నెల 7, 8తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు . రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాలు తెలిపారు.  ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయనతోపాటు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్,  పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు. ట్రిపుల్‌ ఐటీలో రూ.139కోట్లతో నిర్మించిన ఏడు ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగాలను, తరగతి గదులను పరిశీలించారు.

వైఎస్సార్‌ ఆడిటోరియం, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కూడా వారు పరిశీలించారు. అనంతరం సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలకు అధునాత హంగులు సమకూరుస్తున్నట్లు చెప్పారు.  గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నతమైన సాంకేతిక విద్యనందించాలనే ఉద్ధేశంతో వీటిని సంస్థలను మరింత పటిష్టం చేయనున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ట్రిపుల్‌ ఐటీలను పట్టించుకోకుండా నిధులను పసుపు – కుంకుమ పథకానికి వాడుకుందని ఆయన విమర్శించారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సుధీర్‌ ప్రేమ్‌కుమార్, ఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, అకడమిక్‌ డీన్‌ రమేష్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు శరవణ్‌కుమార్, రోజర్‌ బిన్ని, అనిల్‌కుమార్‌రెడ్డి, రూపస్‌కుమార్, తహసీల్దార్‌ ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు