హైదరాబాద్ : నిర్బంధంలో ఉంటూ ఐదు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం గురువారం ఆందోళనకరంగా మారింది. ఆయనను ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పరీక్షించిన జైలు వైద్యులు రక్తంలో ఒక్కసారిగా చక్కెర శాతం సాధారణ స్థాయి కన్నా బాగా పడిపోయినట్లు నిర్థారించారు. రక్తంలో ప్రస్తుతం 57 ఎంజీలుగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని వైద్యులు జగన్ను ఆహారం తీసుకోవాల్సిందిగా సూచించారు.
అయితే జగన్ అందుకు సమ్మతించలేదు. బాగా నీరసంగా ఉన్నప్పటికీ ఆయన తనకు ఎలాంటి ఆహారం వద్దని తిరస్కరించినట్లు జైలు అధికారుల ద్వారా తెలిసింది. తనను బలవంతం చేయవద్దని ఆయన అధికారులను కోరినట్లు చెబుతున్నారు. జైలు డాక్టర్లు, జైలు సూపరిటెండెంట్లో చర్చలు జరిపిన అనంతరం జగన్ రక్త పరీక్ష నివేదికలతో జైళ్ల శాఖ ఐజీ సునీల్కుమార్ వద్దకు బయలుదేరారు.
ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్న జగన్ చేత దీక్షను ఎలా విరమింప జేయాలనే విషయమై ఐజీ వద్ద చర్చలు జరిగాక ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగన్ ఆరోగ్యాన్ని తదుపరి జైలులో ఉన్న వైద్యులే పర్యవేక్షిస్తారా లేక సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలా అనేది కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.