సాక్షి ,అనంతపురం: ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి.. తాను సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. సకాలంలో సంక్షేమ ఫలాలు అందజేస్తూ ఆపన్నుల కన్నీళ్లు తుడిచేందుకు అహరి్నశం శ్రమించారు. తాను పెట్టిన తొలి సంతకంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతల కడగండ్లను ఒక్కసారిగా తుడిచేశారు. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందజేయడమే కాక.. హరితాంధ్ర సాధనలో భాగంగా వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. విద్య, వైద్య రంగాల పురోభివృద్ధికి బాటలు వేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో నిరుపేద విద్యార్థులను డాక్టర్లను, ఇంజినీర్లను చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు నాణ్యతతో కూడిన ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా అందజేశారు. తాగునీటి పథకాలకు జీవం పోస్తూ.. ప్రజల దాహార్తిని తీర్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్సార్ అంటే ఒక వ్యక్తి కాదని.. శక్తి అని నిరూపించారు. ఆ పాలనను స్వర్ణయుగమంటూ నేటికీ వేనోళ్ల కొనియాడుతున్నారు. మహానేత తమ మదిలో జీవించే ఉన్నాడంటూ ఘంటాపథంగా చెబుతున్నారు. వైఎస్సార్ సంక్షేమ ఫలాలతో లబ్ధి పొంది, ఆయన ఆశయాల సాధనలో మేము సైతం అంటూ శ్రమిస్తున్న జిల్లా వాసులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే.
‘పురం’ ప్రజల పాలిట అపర భగీరథుడు..
హిందూపురం: ఒకప్పుడు తాగునీటి కోసం విలవిల్లాడిన హిందూపురం ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా చరిత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచిపోయారు. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురానికి వచ్చిన ఆయన.. ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశారు. ఆ సమయంలోనే ఇక్కడ పార్టీ ఓడినా.. గెలిచినా.. తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్ నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా పురం ప్రజల దాహార్తిని తీరుస్తానంటూ హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 1,400 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయించి 2008 డిసెంబరు 30న తన స్వహస్తాలతో హిందూపురం పట్టణ నడిరోడ్డున రహమత్పురం సర్కిల్ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పైలాన్ను ఆయన ప్రారంభించారు.
ఇచ్చిన మాట అక్షరాల నిలుపుకుని హిందూపురం ప్రజల మదిలో చెరగని ముద్రను ఆయన వేసుకున్నారు. మడకశిర, పెనుకొండ, పరిగి మండలంతోపాటు హిందూపురం నియోజకవర్గం పరిధిలోని మొత్తం 220 గ్రామాలకూ నేడు సమృద్ధిగా తాగునీరు అందుంతోందంటే అదంతా వైఎస్సార్ పుణ్యమేనని స్థానికులు కొనియాడుతున్నారు. అలాగే జలయజ్ఞంలోనూ హిందూపురం ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చారు. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కింద మడకశిర ఉప కాలువ ద్వారా ఈ ప్రాంతంలోని చెరువులకు నీరందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డినే.
ప్రతి నీటి బొట్టులోనూ ‘వైఎస్సార్’
డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన ఈ సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ రాయదుర్గం వాసులను తాగునీటి కష్టాల నుంచి శాశ్వతంగా గట్టెక్కించింది. 2005లో రాయదుర్గం పురపాలక సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఇక్కడకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎదుట స్థానికులు తమ తాగునీటి కష్టాలను ఏకరవు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రస్తుతం తానేమీ చేయలేనని, ఎన్నికలు పూర్తి కాగానే మీ కష్టాలను తీరుస్తానంటూ ఆ సమయంలో ఆయన హామీనిచ్చారు. అనుకున్నట్లుగానే ఎన్నికలు ముగియగానే రాయదుర్గం వాసుల తాగునీటి కష్టాలపై ఆయన దృష్టి సారించారు. 2007లో రూ.48 కోట్లు నిధులు మంజూరు చేసి, కణేకల్లు వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి 168 ఎకరాల భూసేకరణ చేయించారు. 2008లో పనులు ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేయించారు. హెచ్చెల్సీ నీటిని ఎత్తిపోతల ద్వారా ట్యాంక్లోకి నింపి అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా రాయదుర్గానికి చేర్చడం ద్వారా ప్రజలు దాహార్తిని తీర్చారు. ప్రస్తుతం రాయదుర్గం తాము తాగుతున్న ప్రతి నీటి బొట్టులోనూ వైఎస్సార్నే చూడగలుగుతున్నారు.
అనంత అభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర
అనంతపురం సెంట్రల్/విద్య/హాస్పిటల్: అనంత జిల్లా అభివృద్ధిపై మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు.రైతు బాంధవుడిగా వేనోళ్ల కొనియాడబడుతున్న ఆ మహానేత జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్
పాత్రను గుర్తు చేసుకుంటూ...
తాడిపత్రిపై రాజన్న ముద్ర..
తాడిపత్రి: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తాడిపత్రి అభివృద్ధి పథంలో పరుగులు తీసింది. అనంత జిల్లా అల్లుడిగా తాడిపత్రి అంటే ఆయనకూ అభిమానం ఎక్కువ. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో ఆయన పెళ్లి చేసుకున్నారు.
మా ఇంట కొలువైన దేవుడు
13 సంవత్సరాల క్రితం నేను, నా భార్య చెన్నమ్మ, కుమార్తె ప్రభావతమ్మ కలిసి పొలం దగ్గరకు పోతుండగా ఎలుగుబంటి దాడి చేసి, ముగ్గురినీ తీవ్రంగా గాయపరిచింది. ఆ రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేని మాకు వైఎస్సార్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందివ్వడమే కాక, మెరుగైన వైద్యం చేయించింది. అంతేకాక ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాక, పింఛన్ను కూడా మంజూరు చేయించి ఆదుకున్నారు. ఆ రోజు నుంచి మా ఇంటిలో వైఎస్సార్ ఫొటో పెట్టుకుని రోజూ పూజలు చేస్తున్నాం.
– ఆంజనేయులు, బీసీ కాలనీ, కనగానపల్లి
వైఎస్సార్ తాతకు దండాలు
నేను ఏడాది వయసులో ఉన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడినంటా. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్లోని పెద్దాస్పత్రిలో నాకు ఆపరేషన్ చేయించి, అమ్మానాన్న రవీంద్రారెడ్డి, అలివేలమ్మ తీసుకొచ్చారంటా. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అదంతా వైఎస్సార్ తాత పెట్టిన భిక్షే కదా... అందుకే వైఎస్సార్ తాతకు దండాలు పెడుతున్నా.
– సుమంత్రెడ్డి, యలకుంట్ల, కనగానపల్లి మండలం