క్షీణిస్తున్న విజయమ్మ ఆరోగ్యం

23 Aug, 2013 09:42 IST|Sakshi

గుంటూరు :  సమన్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న సమర దీక్ష నేటికి అయిదో రోజుకు చేరింది. గత నాలుగు రోజులుగా మంచినీళ్ల మీదే ఉండటంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు విజయమ్మకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్షను విరమించాలంటూ సూచించారు. అయినా విజయమ్మ మాత్రం పట్టదలతో దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రభుత్వ వైద్యులు దీక్షా శిబిరానికి వచ్చి విజయమ్మ ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. బీపీ, సుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని వైద్యులు నిర్థారించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పెదవి విప్పటంలేదు. మరోవైపు విజయమ్మ కూర్చొనే ఓపిక లేకపోవడంతో కొన్నిసార్లు పడుకునే ఉంటున్నారు.

శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు అభివాదం కూడా చేయలేకపోతున్నారు. శక్తిని కూడదీసుకుని కూర్చోవడాన్ని చూసి అక్కడకొచ్చిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉండటంతో శిబిరం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
 

మరిన్ని వార్తలు