మనసున్న మారాజు

9 Aug, 2019 08:23 IST|Sakshi
వైఎస్‌ వివేకానందరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, వైఎస్‌ విజయమ్మ, కుటుంబ సభ్యులు

ఘనంగా వైఎస్‌ వివేకానందరెడ్డి జయంతి

ఘాట్‌ వద్ద నివాళులర్పించిన వైఎస్‌ కుటుంబ సభ్యులు 

సాక్షి, పులివెందుల :  దివంగత మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మనసున్న మహారాజు అని వైఎస్‌ కుటుంబ సభ్యులు, వక్తలు, పలువురు కొనియాడారు. వైఎస్‌ వివేకానందరెడ్డి జయంతి వేడుకలను పులివెందులలో గురువారం ఘనంగా నిర్వహించారు. డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్‌ సమాధుల తోటలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, వివేకా సోదరి విమలమ్మ, సోదరులు సుధీకర్‌రెడ్డి, రవీంద్రనాథరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భాకరాపురంలో ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి స్వగృహంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభను పాస్టర్‌ బెనహర్‌ బాబు, పాస్టర్‌ మైఖేల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కుటుంబానికి, ప్రజలకు వైఎస్‌ వివేకానందరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. వివేకానందరెడ్డి భౌతికంగా దూరమైనా... కుటుంబ సభ్యుల అందరి మనసులో, పులివెందుల ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు కొనియాడారు.డాక్టర్‌ ఇసీ గంగిరెడ్డి, ఇసీ సుగుణమ్మ, దివంగత జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ వైఎస్‌ ప్రమీలమ్మ, వైఎస్‌ కొండారెడ్డి, క్రిష్టఫర్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు  
స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ఉదయ కాలపు ఆరాధన నిర్వహించారు. అనంతరం సీఎస్‌ఐ చర్చి సంఘ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ  చైర్‌ పర్సన్‌ వైఎస్‌ ప్రమీలమ్మతోపాటు పాస్టర్‌ బెనహర్‌బాబు, సెక్రటరీ శిఖామణితోపాటు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.

అన్నదానం 
పట్టణంలోని పలు కాలనీల్లో అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, తొండూరు మండల ఇన్‌చార్జి వైఎస్‌ మధురెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీ, నగరిగుట్ట ఎస్సీ కాలనీల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిన్నప్ప హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కోడి రమణ, కోళ్ల భాస్కర్, బూత్‌ కమిటీల మేనేజర్‌ గంగాధరరెడ్డి, కార్యకర్తలు శ్రీను, ప్రభుదాసు, ఏసు, నాగేంద్ర, కుళ్లాయప్ప, బాబు, జకరయ్య తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన వైఎస్‌ కుటుంబీకులు 
ఇంటి సమీపంలో పాల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్‌ వివేకా విగ్రహం సమీపంలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, దివంగత జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. 

మరిన్ని వార్తలు