నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టు

24 Jul, 2019 07:57 IST|Sakshi
కోర్టు ప్రాంగణం వద్ద నలుగురు వైఎస్సార్‌సీపీ  కార్యకర్తలు 

టీడీపీ వారే దాడి చేసి తిరిగి ఫిర్యాదు 

నాదెండ్ల(చిలకలూరిపేట): గుంటూరు జిల్లా, నాదెండ్ల మండలంలోని తూబాడు గ్రామానికి చెందిన నలుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. తూబాడు మాజీ సర్పంచి నర్రా మేరయ్యకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు శ్రీరామయ్య భార్య వెంకటేశ్వరమ్మ సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన షేక్‌ శ్రీను ఆమె వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో భర్తతో పాటు బంధువులూ అక్కడకు చేరుకుని షేక్‌ శ్రీనుకు దేహశుద్ధి చేశారు.

అయితే అతని బంధువైన ఆర్‌ఎంపీ, టీడీపీ వర్గీయుడు షేక్‌ మీరావలి తన వర్గీయులను తీసుకొచ్చి వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై కర్రలతో దాడికి తెగబడ్డాడు.   తమపై దాడి జరిగిందంటూ టీడీపీ వర్గీయులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో పోలీసులు వచ్చి మాజీ సర్పంచి ఉషోదయ స్వప్నమేరి నివాసం తలుపులు పగులగొట్టి అక్కడున్న పదిమంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. నర్రా అంకమ్మరావు, సిరిబోయిన గోపిరాజు, నర్రా సాంబశివరావు, రాఘవ రమేష్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి చిలకలూరిపేట కోర్టులో హాజరు పరిచారు.

మరిన్ని వార్తలు