అమరావతి: శాసనసభ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. సభా నియమాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని, పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని నిరసన తెలుపుతూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జల దినోత్సవంపై ప్రకటన అంటూ సీఎం సుదీర్ఘ ప్రసంగం చేశారని, ఎజెండాకు కట్టుబడాల్సిందిపోయి సోత్కర్షలు చేశారన్నారు. 18 పేజీల సుదీర్ఘ ప్రసంగాన్ని స్టేట్మెంట్గా పెట్టారని, జల సంరక్షణ గురించి కాకుండా సొంత డబ్బా ఏకరువు పెట్టారన్నారు. 2004-09 నాటి ప్రాజెక్టుల వ్యయం గురించి ఇప్పుడెందుకని ప్రశ్నించారు. స్టేట్మెంట్పై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదని తప్పు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, అందుకే తాము సభ నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు.
కాగా అంతకు ముందు జల దినోత్సవం సందర్భంగా ప్రకటన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆ ప్రకటన చేస్తూ ప్రాజెక్ట్ల అంశాన్ని సీఎం లేవనెత్తారు. అయితే ప్రకటన పేరుతో సభను తప్పుదోవ పట్టించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు.