దివాన్ చెరువులో వైఎస్ఆర్ సిపి విజయం

8 Oct, 2014 19:13 IST|Sakshi

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీ ఎన్నికలలో  వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు విజయం సాధించారు. వైఎస్ఆర్ సిపి మద్దతుదారు చంద్రరావు 792 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామంలోని 16 వార్డులలో 12 వార్డులలో వైఎస్ఆర్ సిపి మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ మూడు వార్డులలో, టిడిపి ఒక వార్డులో విజయం సాధించాయి. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు.

ఈ పంచాయతీని దివాన్‌చెరువు, శ్రీరామపురంగా విభజించేందుకు 1996లో అప్పటి పాలకవర్గం తీర్మానించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు స్థానికులు హైకోర్టుకు వెళ్లారు.  గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టు తీర్పు వారికి అనుకూలంగా ఇచ్చింది.  విభజించకుండానే గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గత మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సమయానికి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరగలేదు. అందువల్ల అప్పట్లో దివాన్‌చెరువు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. తరువాత ప్రాదేశిక, పురపాలక, సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజు ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు.

 దివాన్‌చెరువు పంచాయతీకి శ్రీరామపురం, రఘునాథపురం శివారు గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 8,597. సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.  మల్లారపు సత్యానందం, కొవ్వాడ చంద్రరావు, నిడమర్తి సత్తిరాజు, బుంగా భాస్కరరావు, విజయ ప్రియదర్శిని సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచారు. మొత్తం 16 వార్డులలో 15 చోట్ల ద్విముఖ, ఒక చోట త్రిముఖ పోటీ జరిగింది.
**

మరిన్ని వార్తలు