హామీలకు రెండేళ్లు.. అమలుకు ఇంకెన్నేళ్లో ?

11 Nov, 2017 05:40 IST|Sakshi

జమ్మలమడుగు: నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌  నాడు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అందులో మైలవరం మండలం నవా బుపేట సమీపంలో రెండువేల ఎకరాల్లో రెండేళ్లలోనే దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టరీ ని ర్మాణాన్ని పూర్తి చేయించారు. చేనేత కా ర్మికులకు టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం కోసం  నిధులు కేటాయించారు. జలాశయం ఉండడంతో చేపల ఉత్పత్తి కేంద్రానికి కూడా 2005లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారు.

వైఎస్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలెన్నో..
గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించి 2008లో పదివేల కోట్ల రూపాయలతో గ్లోబెల్‌ టెండర్లను ఆహ్వానించారు.

జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు సమీపంలో ఎవరూ చేయని విధంగా 1,499 ఇళ్లు నిర్మించి రాజీవ్‌కాలనీ ఏర్పాటు. ∙జమ్మలడుగు–తాడిపత్రి రహదారి బైపాస్‌ రోడ్డు మంజూరు ∙మైలవరం జలాశయం నుంచి 60 గ్రామాలకు, సీపీడబ్ల్యూ స్కీం కింద ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా

మైలవలరం మండలంలో..
రూ.380 కోట్లతో గండికోట ప్రాజెక్ట్‌ నిర్మాణం. అవుకు నుంచి మైలవరం మండలం లింగాపురం వరకు రూ.300 కోట్లతో కాలువల నిర్మాణం, మరో రూ.300 కోట్లతో ఐదున్నర కిలోమీటర్ల దూరం వరకు సొరంగ మార్గం పనులు ∙మైలవరం జలాశయం ఆధునీకరణ కోసం రూ.150 కోట్లు మంజూరు

∙పెద్దముడియం మండలంలో ఎస్‌ఆర్‌బీసీ పెండింగ్‌లో ఉన్న 38వ ప్యాకేజీ పనులు.

ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కానివి..
మైలవరం మండలంలో ఏసీసీ సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆ కంపెనీ యాజమాన్యం రైతుల నుంచి 20 ఏళ్ల క్రితం భూములు సేకరించింది. ఇప్పటికీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు. గతేడాది ఏసీసీ యాజమాన్యం ఫ్యాక్టరీతో పాటు పవర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ప్రజాభిప్రాయసేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణరెడ్డి భూములు నష్టపోయిన రైతులకు అదనంగా డబ్బులు ఇప్పిస్తామని ఉగాది పండుగప్పుడు హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఇవ్వలేదు.

సీఎం చంద్రబాబు హామీకి రెండేళ్లు..
గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2015 నవంబర్‌లో జమ్మలమడుగు పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. ఇక్కడ టూరిజం హబ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అతీగతీ లేదు.

గండికోట ముంపు సమస్య..
గండికోట ప్రాజెక్టు నిర్మాణంలో 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొదటి విడతగా 14 గ్రామాల ప్రజలకు ముంపు పరిహారంతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఆ పునరావాస కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఆయన మరణానంతరం అభివృద్ధి అనే మాట కనుచూపు మేరలో ఆగిపోయింది. వైఎస్‌ తన హయాంలో పులివెందుల తర్వాత అభివృద్ధి కోసం జిల్లాలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నియోజకవర్గాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు