పాడేరులో వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజీ

4 Jun, 2020 03:59 IST|Sakshi
మెడికల్‌ కాలేజీ మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రులు

అనుబంధంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి

వైద్య సిబ్బంది పోస్టులకు వారంలో నోటిఫికేషన్‌

డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ ఏజెన్సీ పాడేరులో డాక్టర్‌ వైఎస్సార్‌ మెడికల్‌ కాలేజ్, దీనికి అనుబంధంగా 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ ఆస్పత్రి కోసం పాడేరులో కేటాయించిన స్థలాన్ని బుధవారం మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, బాబూరావు పరిశీలించారు. ఆళ్ల నాని మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ ప్రాంతంలోనే నర్సింగ్‌ కాలేజీని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. 9,700 వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్‌ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.  

ఐటీడీఏల్లో ఆరోగ్య వ్యవస్థపై సమీక్ష  
గిరిజనులు విషజ్వరాల బారిన పడకుండా ఏజెన్సీలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రబలే విషజ్వరాలు, నివారణపై ఆయన సమీక్షించారు. జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షణలో ప్రతి గ్రామంలోనూ శానిటేషన్‌ చేపట్టాలని సూచించారు. అనకాపల్లిలో నిర్మించే మెడికల్‌ కాలేజీకి స్థలాలనూ మంత్రులు పరిశీలించారు. 

మరిన్ని వార్తలు