ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
నిర్మాణ పనుల్లో జాప్యం నివారణకు ఆస్కారం
వైద్య సంబంధిత సామగ్రి కొనుగోలు సౌలభ్యం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ నిర్మాణ్, ఏపీ ఇండస్ట్రీస్ కోవిడ్–19 రెస్పాన్స్ పోర్టల్స్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు, పేదల గృహ నిర్మాణం, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఏ పరిమాణంలో సిమెంటు కావాలో వైఎస్సార్ నిర్మాణ్ పోర్టల్, యాప్ ద్వారా ఇండెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సిమెంట్ తయారీ కంపెనీలు, వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయడమే ఈ యాప్ లక్ష్యం. తద్వారా పనులు ఆలస్యం కాకుండా ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ ధనం ఆదా అవుతుంది. సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్)కు వైఎస్సార్ నిర్మాణ్ పోర్టల్ను అనుసంధానం చేయడం వల్ల సరఫరాదారులకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆన్లైన్ ద్వారా వారి బిల్లులు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
► రాష్ట్రంలో ఉన్న మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) కంపెనీలు, సరఫరాదారులు ఏపీ ఇండస్ట్రీస్ కోవిడ్–19 రెస్పాన్స్ పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.
► కోవిడ్–19 మెడికల్ రిలేటెడ్ ఐటెంలు, మాస్క్లు, శానిటైజర్స్, బెడ్స్, బెడ్ రోల్స్ వంటి వైద్య పరమైన సామగ్రి అమ్మేవారు, కొనేవాళ్లు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
► దీని వల్ల ఎవరి దగ్గరి ఎలాంటి వైద్య పరమైన, ఇతర సంబంధిత ఉత్పత్తులున్నాయన్న వివరాలతోపాటు అమ్మేవాళ్లు, కొనేవాళ్లను ఒకే ప్లాట్ఫాంపైకి వచ్చే వెసులుబాటు ఉంటుంది.
► దీనిని డెస్క్టాప్ లేదా మొబైల్ యాప్ ద్వారా అందరూ వాడుకోవచ్చు. అవసరమైన సామగ్రి కొనుగోలు చేయుటకు సౌలభ్యంగా ఉంటుంది.