డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగు

5 Oct, 2019 11:57 IST|Sakshi
గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్తూ సేవ చేస్తున్న ఆటో డ్రైవర్‌ ప్రకాష్‌ను సన్మానిస్తున్న మంత్రి ముత్తంశెట్టి, విప్‌ బూడి ముత్యాలనాయుడు

జిల్లాలో 24,512 మందికి లబ్ధి

వాహనమిత్ర ద్వారా ఐదేళ్లలో రూ.50 వేల ఆర్థిక సాయం

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆటో వృత్తితో పేద, నిరుద్యోగ యువతకు తక్షణ ఉపాధి లభిస్తుందన్నారు. ఆటోడ్రైవర్ల కష్టాలను తన ప్రజాసంకల్పయాత్రలో స్వయంగా తెలుసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ పథకం ద్వారా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించడం శుభపరిమాణంగా అభివర్ణించారు. శుక్రవారం రవాణ శాఖ ఆధ్వర్యంలో విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సామాన్య ప్రయాణాలకు అందుబాటులో ఉంటూ .. ఏ సయమంలోనైనా ఆపద్భాందవుడిగా ఆదుకునేవాడే ఆటోవాలా అని కొనియాడారు.

లక్షల కుటుంబాలకు ఆసరా
ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 73 వేల 531 మంది వాహనదారులు లబ్ధిపొందనుండగా..విశాఖ జిల్లాలో 24,512 మంది డ్రైవర్లు లబ్ధిపొందనున్నట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ వాలాలకు ఏటా రూ.10 వేల చొప్పున ఐదేళ్లలో రూ. 50 వేలు అందిండం జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయంతో లక్షలాది కుటుంబాలకు ఆసరా నిలుస్తుందని చెప్పారు.విశాఖ జిల్లాలో ఎక్కువమంది డ్రైవర్లు:కలెక్టర్‌ వినయ్‌చంద్‌కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కంటే విశాఖ జిల్లాలోనే ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఉన్నారన్నారు. జిల్లాలో ఉన్న 24,512 మందికి సుమారుగా రూ. 24. 51కోట్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.

మాట నిలపుకున్న జగన్‌:ద్రోణంరాజు
వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అతితక్కువ కాలంలో అమలు చేస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల నియామకాలతో యువతకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారన్నారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు ఆర్థిక సహాయంతో వారిలో ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా నింపుతుందన్నారు.

ఆర్థిక అండ:విప్‌ ముత్యాలనాయుడు
ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువగా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారన్నారు. కుగ్రామాల నుంచి మహానగరాల వరకు ఆటోవాలా సేవలు అన్ని రంగాల్లో విస్తరించాయని తెలిపారు. వారందరికీ ఆర్థికంగా సహాయపడేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వాహన బీమా సకాలంలో కట్టెందుకు, మరమ్మతులకు ఉపయోగపడుతుందన్నారు. బీమా ఉంటే ప్రమాదం సంభవించినప్పుడు ఆటో, క్యాబ్‌ డ్రైవర్లపై ఆర్థిక భారం తప్పుతుందన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్‌ జి. సృజన, ఆర్డీవో పెంచల కిశోర్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌గణేష్, కె.భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ రాజారత్నం, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, పార్టీ అధికార ప్రతినిధి, కార్యదర్శులు కొయ్య ప్రసాద్‌రెడ్డి, రొంగలి జగన్నాథం, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు