విజయ సారథులు వీరే..

18 Mar, 2019 08:33 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన వైఎస్‌.జగన్‌

ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా మాగుంట

బాపట్లకు నందిగం, నెల్లూరుకు ఆదాల

12 అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్ల కేటాయింపు పూర్తి

ఎన్నో వడపోతలు, సర్వేల అనంతరం ప్రజలు మెచ్చిన అభ్యర్థులనే విజయ సారథులుగా వైఎస్సార్‌ సీపీ బరిలో దించింది. ఐదేళ్ల ప్రజాకంటక పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజా క్షేమమే అజెండాగా పార్టీ అభ్యర్థులు జనం ముందుకు వచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే చేపట్టే నవరత్న పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ప్రజల ఆశీర్వాద బలంతో విజయతీరాలకు చేరతామని ధీమాగా ఉన్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఇడుపులపాయలో ప్రకటించారు. జిల్లాలోని ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎంపిక చేశారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించగా బాపట్ల పార్లమెంటు అభ్యర్థిగా నందిగం సురేష్‌కు టికెట్‌ కేటాయించారు. ఇక ఒంగోలు అసెంబ్లీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశారు. బాలినేని గతంలో నాలుగు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు. కందుకూరు అభ్యర్థిగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిని ఎంపిక చేయగా కొండపి అభ్యర్థిగా డాక్టర్‌ వెంకయ్యను బరిలో నిలిపారు. గిద్దలూరు టికెట్‌ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కేటాయించారు.

మార్కాపురం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు కుందురు నాగార్జున్‌రెడ్డిని ఎంపిక చేశారు. యర్రగొండపాలెం నుంచి సంతనూతలపాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు టికెట్‌ కేటాయించారు. దర్శి అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్‌ను ఎంపిక చేయగా కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు.  పర్చూరు టికెట్‌ సీనియర్‌ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించగా చీరాల అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను ఎంపిక చేశారు. సంతనూతలపాడు నుంచి టీజేఆర్‌ సుధాకర్‌బాబుకు టికెట్‌ కేటాయించారు. మొత్తంగా ఒకే విడతలో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటుకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి, కొండపి, ఒంగోలు నియోజకవర్గాలు ఉండగా బాపట్ల పార్లమెంటు పరిధిలో సంతనూతలపాడు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నియోజకవర్గం ఉంది.

అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు

 ఒంగోలు   బాలినేని శ్రీనివాసరెడ్డి
 కందుకూరు  మానుగుంట మహీధరరెడ్డి
 అద్దంకి   బాచిన చెంచుగరటయ్య
 చీరాల  ఆమంచి కృష్ణమోహన్‌
 గిద్దలూరు  అన్నా వెంకటరాంబాబు
 పర్చూరు  దగ్గుబాటి వెంకటేశ్వరరావు
 దర్శి  మద్దిశెట్టి వేణుగోపాల్‌
 మార్కాపురం  కుందురు నాగార్జునరెడ్డి
 కనిగిరి  బుర్రా మధుసూదన్‌ యాదవ్‌
 కొండపి (ఎస్సీ)  మాదాసి వెంకయ్య
 సంతనూతలపాడు (ఎస్సీ)  టీజేఆర్‌ సుధాకర్‌బాబు
 యర్రగొండపాలెం (ఎస్సీ)  ఆదిమూలపు సురేష్‌

పార్లమెంటు అభ్యర్థులు
1. ఒంగోలు   – మాగుంట శ్రీనివాసులురెడ్డి
2. బాపట్ల    – నందిగం సురేష్‌
3. నెల్లూరు  – ఆదాల ప్రభాకరరెడ్డి

>
మరిన్ని వార్తలు