ఓటమి భయంతో అనుచిత వ్యాఖ్యలు

8 Apr, 2019 10:36 IST|Sakshi

సాక్షి, చిలకలూరిపేట : ఓటమి భయంతో మతి భ్రమించి మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో శనివారం రాత్రి నిర్వహించిన సీఎం  చంద్రబాబు నాయుడు సభ విఫలం కావడంతో సహనం కోల్పోయి అనుచిత వ్యాఖ్యలకు దిగజారారని విమర్శించారు. తనను మహానటి అని పుల్లారావు విమర్శించటాన్ని తప్పు పట్టారు.

తనకు తాను మహానాయకుడని చెప్పుకొనే ఆయన ఆ సినిమా ఎంత ప్లాప్‌ అయ్యిందో గుర్తించాలన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పుల్లారావు మట్టికరవటం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలందరినీ మోసగించే కపటనటుడు మంత్రి ప్రత్తిపాటి అని నియోజకవరంలో అందరికీ తెలుసన్నారు. అసలు మీ గురించి, మీ జీవితం గురించి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని హితవు పలికారు.

మీరు చేసిన మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, వంచనలు, హత్యలు తప్ప మీ జీవితంలో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదని ధ్వజమెత్తారు. రేషన్‌ డీలర్‌గా జీవితాన్ని ప్రారంభించిన పుల్లారావు.. ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరిపేటకు వచ్చి, వ్యాపారం పేరుతో ఆర్యవైశ్యుల దగ్గర కోట్లాది రూపాయలు అప్పు చేసి వారికి ఎగనామం పెట్టారని ఆరోపించారు. కన్న తండ్రికి తలకొరివి పెట్టాల్సి వస్తుందని, మీరు ఊరు విడిచి పారిపోతే వేరొకరు మీ తండ్రి చితికి నిప్పు పెట్టిన విషయం బహుశా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియక పోవచ్చన్నారు.

కన్న తల్లికి  మీరు ఇప్పటికీ అన్నం పెట్టకపోతే, ఆమె ఒంటరిగానే జీవిస్తున్న సంగతి మీ నిజనైజానికి అద్దం పడుతుందన్నారు.  వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి అన్నదానం చేసేటప్పుడు, ఆ ఫొటోలకు ఫోజులిచ్చేటప్పడు మీ అమ్మానాన్నలు ఎప్పుడైనా గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. అలాంటి ప్రత్తిపాటి పుల్లారావుకు తన కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదన్నారు.  

ఆరోపణలకు ఆధారం ఉందా?
తన భర్త విడదల కుమారస్వామిని తానే అమెరికా పంపినట్లు మంత్రి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు వ్యవహారమన్నారు. తన భర్త 20 ఏళ్ల నాడు అమెరికా వెళ్లినప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గుడ్డి పత్తి వ్యాపారం చేసుకుంటూ, రైతులకు డబ్బులు చెల్లించకుండా దాక్కొనే పరిస్థితులు నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. వీఆర్‌ ఫౌండేషన్‌ పేరుతో విదేశాల్లో విరాళాలు వసూలు చేస్తున్నారని నీతి లేని ఆరోపణలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాక పౌండేషన్‌ స్థాపించామని, దాని రిజిస్ట్రేషన్‌ ఇక్కడే ఉందని, దీనికి విరుద్ధంగా ఒక్క ఆధారం ఉన్నా పుల్లారావు నిరూపించాలని సవాలు విసిరారు. మా మామయ్య విడదల లక్ష్మీనారాయణకు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పదవి ఇప్పించానని చెబుతున్న మంత్రి పుల్లారావు, ఆ పదవి కోసం ఎంత డబ్బులు తీసుకుంది, మీ లోకేష్‌ బాబుకు ఎన్ని కోట్లు ఇప్పించింది ఆధారాలతో సహా తన కుటుంబ సభ్యులు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మల్లెల రాజేష్‌ నాయుడు డబ్బులు ఇస్తే గాని ప్రత్తిపాటి చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున వైద్యశిబిరాలు నిర్వహించలేని మీరు కూడా కాకమ్మ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎడ్ల పందాలు కూడా రాజేష్‌ నాయుడు డబ్బులతోనే నిర్వహించింది వాస్తవం కదా అని ప్రశ్నించారు.  వీఆర్‌ ఫౌండేషన్‌ పేరుతో మేము పేదలకు సాయం చేయాలని వచ్చామని తెలిపారు. కాని మీరు స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను దారుణంగా మోసగించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

వ్యాపారులకు అండగా ఉంటాం
ఇప్పటికీ మీ భార్య పేరున వెంకాయమ్మ ట్యాక్స్‌ వసూలు చేస్తున్న మీరు, ఇతరులు గెలిస్తే పన్ను వసూలు చేస్తారని అవాస్తవాలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. మీలాగా రాజకీయాల్లో  పెట్టుబడి పెట్టి దానికి పదింతలు సంపాదించాలన్న దుర్భుద్ధితో రాజకీయాల్లోకి రాలేదని, మాకు ఉన్నదాంట్లో సేవ చేద్దామనే వచ్చామని చెప్పారు. తాము వ్యాపారులకు అండగా ఉంటామని వివరించారు. 

మరిన్ని వార్తలు