జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభంజనం
పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లు కైవసం
కనివిని ఎరుగని రీతిలో మెజార్టీ
అప్పగించిన ఓటర్లు
నియంతృత్వానికి ఓటుతో బుద్దిచెప్పిన జమ్మలమడుగు ప్రజలు
వైఎస్ కుటుంబానికి అండదండగా ఉంటామని నిరూపించిన జిల్లా వాసులు
సాక్షి, కడప: వైఎస్సార్సీపీ జిల్లాలో క్లీన్స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలను చేజిక్కించుకుంది. ప్రజలు అపూర్వమైన తీర్పును ఇచ్చారు. ఈ పార్టీకి చెందిన అభ్యర్థులందరికీ బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రభంజనాన్ని మరిపించేలా వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వానికి బ్రహ్మరథం పట్టారు. నడిమంత్రపు హోదాతో వచ్చిన నియంతృత్వం, అహంకారానికి జమ్మలమడుగు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వెరశి కౌంటింగ్లో రౌండు రౌండులో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జిల్లా ప్రజలు తీర్పు ప్రకటించారు. అభివృద్ధిని గాలికొదిలి మాటల గారడీతో నెట్టుకొచ్చిన అధికార టీడీపీకి ఈఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అహంకారపు మాటలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యహక్కులను కాలరాస్తూ వచ్చిన టీడీపీ నేతలకు బుద్ధి చెప్పారు. నడిమంత్రపు హోదాతో వైఎస్ కుటుంబాన్ని తూలనాడుతూ వచ్చిన తాజా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని తిరస్కరించారు.
‘కుక్కకాటుకు చెప్పు దెబ్బ’ అన్నట్లుగా సొంత నియోజకవర్గం జమ్మలమడుగులో ఘోర పరాభవం అప్పగించారు. గ్రామాల్లో స్వేచ్ఛగా ఇతర పార్టీల నాయకులు తిరిగేందుకు కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన దుర్భర పరిస్థితులను తోసిపుచ్చారు. తాము ఏకమైతే తట్టుకోగలరా...ఎదురొడ్డి నిలిచే మొనగాడు ఎవ్వరంటూ తూలనాడిన నాయకునికి సిసలైన తీర్పునిచ్చారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజకీయ జీవితంలో ఏనాడు చూడని, ఊహించని మెజార్టీని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్రెడ్డి సాధించారు. వర్గరాజకీయాలు కోసం ఫ్యాక్షన్ను పెంచి పోషించిన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల స్వార్థ దృక్పథాలను ప్రజలు ఏమాత్రం సమ్మతించలేదు. అదే విషయాన్ని పోలింగ్ ద్వారా స్పష్టం చేశారు. జమ్మలమడుగు పరిధిలోని అన్నీ మండలాలల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు.
కనివిని ఎరుగని మెజార్టీ సొంతం....
జిల్లాలో పదికి పది సీట్లు ఏకపక్షంగా మొగ్గిన పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. వైఎస్సార్ హవాలో కూడా ఒక్కసీటు కోల్పోయారు. కాగా వైఎస్సార్సీపీ అన్నీ సీట్లును దక్కించుకోగా, ఆ పార్టీ అభ్యర్థులకు పరిశీలకులు ఊహించని స్థాయిలో మెజార్టీ స్వంతం దక్కించుకున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో 90,110 ఓట్లు మెజార్టీ దక్కించుకున్నారు. కడప ఎమ్మెల్యేగా ఎస్బి అంజాద్భాషా 52,539 ఓట్లు ఆధిక్యత చేజేక్కించుకున్నారు. జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్రెడ్డి 51,345 ఓట్లు మెజార్టీ పొంది జిల్లాలో మూడోస్థానంలో నిలిచారు.
బద్వేల్ నుంచి పోటీచేసిన డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్లు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి 43,148 ఓట్లు మెజార్టీ సొంతం చేసుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి29,990, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు 34,510వేల పైచిలుకు మెజార్టీ దక్కించుకోగా, రాయచోటిలో 32,679 మెజార్టీని ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి దక్కించుకున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి 26168, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి 29,674వేటు ఓట్లు ఆధిక్యత సాధించుకున్నారు.
ప్రజల మధ్యలో ఉన్న నేతలకే పట్టం....
నిత్యం ప్రజల మధ్య నేతలకే ప్రజలు ఎన్నికలల్లో పట్టం కట్టారు. అదే విషయం ఫలితాలల్లో స్పష్టమైంది. గడిచిన ఐదేళ్లుగా ప్రజాసమస్యలపై ఉద్యమాలు ఓవైపు, పార్టీ కార్యక్రమాలతో మరోవైపు ప్రజల మధ్యనే ఉండిపోయిన నాయకులకు విజయాన్ని అప్పగించారు. మూడేళ్లుగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు చేపట్టి గడపగడపను చుట్టేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా విజయం సాధించారు. జిల్లా ప్రజలంతా వైఎస్ కుటుంబం వెన్నంటే ఉంటూ వైఎస్సార్సీపీని బలపరుస్తున్నామని ఎన్నికల ద్వారా తీర్పు చెప్పారు. ఆమేరకు జిల్లాను క్లీన్స్వీప్ చేస్తూ ఫలితాలు అప్పగించడం విశేషం.
ఇది ప్రజాతీర్పు
చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా భారీ మెజార్టీతో తనను మైదుకూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నా. ఎన్నో బాధలు పెట్టినా భరించాము. అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలంటే వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తారు. గత మూడు, నాలుగు సంవత్సరాల నుంచి కరువుతో రైతులు బాగా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంది. చంద్రబాబు లక్షల కోట్లను దోచుకుని ఖజానాను ఖాళీ చేశారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక వనరులను సమకూర్చి అభివృద్ధి పథంలో ప్రజలను నడిపిస్తారనే భరోసా ప్రతి ఒక్కరిలో ఉంది.
– శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే
రాజన్న రాజ్యం కోసమే ప్రజలు గెలిపించారు
రాజన్న రాజ్యం మరలా రావాలని ప్రజలు వైఎస్సార్సీపీని అత్యధిక సీట్లతో గెలిపించారు. ప్రజలందరూ 2014లో 40 సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన చంద్రబాబును అమరావతి రాజధాని అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. కానీ హామీలనుగానీ, అభివృద్ధినిగానీ చేయని చంద్రబాబు కొన్ని లక్షల కోట్లను బినామీ ఆస్తులుగా మార్చుకుని రాజధాని చుట్టూ కోటరీని ఏర్పరుచుకుని దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేరువై వారి కష్టాలను దగ్గరగా చూశారు. లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారు.
– పి.రవీంద్రనాథ్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే
నియోజకవర్గం: జమ్మలమడుగు
మొత్తం ఓటర్లు: 2,37,551
పోలైన ఓట్లు: 2,02,890
పురుషుల ఓట్లు: 116382
స్త్రీల ఓట్లు: 121169
నియోజకవర్గం: కమలాపురం
మొత్తం ఓటర్లు: 1,92,909
పోలైన ఓట్లు: 1,59,335
పురుషుల ఓట్లు: 95,237
స్త్రీల ఓట్లు: 97672
నియోజకవర్గం: రాయచోటి
మొత్తం ఓటర్లు : 2,31,610
పోలైన ఓట్లు : 1,75,943
పురుషుల ఓట్లు : 1,15,365
స్త్రీల ఓట్లు : 1,16,245
నియోజకవర్గం: రాజంపేట
మొత్తం ఓటర్లు: 2,22,251
పోలైన ఓట్లు: 1,69,077
పురుషుల ఓట్లు: 10,8849
స్త్రీల ఓట్లు: 113402
నియోజకవర్గం: రైల్వేకోడూరు
మొత్తం ఓటర్లు: 1,82,649
పోలైన ఓట్లు: 1,37,534
పురుషుల ఓట్లు: 90,218
స్త్రీల ఓట్లు: 92,431
నియోజకవర్గం: పులివెందుల
మొత్తం ఓటర్లు: 2, 23,395
పోలైన ఓట్లు: 1,80,663
పురుషుల ఓట్లు: 1,09,590
స్త్రీల ఓట్లు: 1,13,805
నియోజకవర్గం: మైదుకూరు
మొత్తం ఓటర్లు: 2,07,946
పోలైన ఓట్లు: 1,71,779
పురుషుల ఓట్లు: 1,03,070
స్త్రీల ఓట్లు: 1,04,876
నియోజకవర్గం: కడప
మొత్తం ఓటర్లు: 2,65,067
పోలైన ఓట్లు: 1,64,772
పురుషుల ఓట్లు: 1,30,063
స్త్రీల ఓట్లు: 1,35,004
నియోజకవర్గం: బద్వేలు
మొత్తం ఓటర్లు: 2,04,597
పోలైన ఓట్లు: 1,58,863
పురుషుల ఓట్లు: 102811
స్త్రీల ఓట్లు: 101786
నియోజకవర్గం: ప్రొద్దుటూరు
మొత్తం ఓటర్లు: 2,36,689
పోలైన ఓట్లు: 1,82,125
పురుషుల ఓట్లు: 115532
స్త్రీల ఓట్లు: 121157