మంత్రి దేవినేని అబద్ధాల కోరు

29 Nov, 2018 12:17 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నాటికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన దేవినేని ఉమ ఇప్పటి వరకు కనీసం గేట్లను కూడా నిర్మించలేదన్నారు. బహుళార్థక ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సి ఉన్నప్పటికీ...సీఎం చంద్రబాబు కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడి రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెబుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా రూ. 18 వేల కోట్లు కాగా, చంద్రబాబు, బీజేపీ ప్రభుత్వాలు దీన్ని రూ.58,750 కోట్లకు పెంచారన్నారు.

దీని ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ నిధులతో 2019 ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. మంత్రి దేవినేని మాత్రం అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారన్నారు. జిల్లాలోని కరువును పారదోలామని చెబుతున్న ప్రభుత్వం... ఒక్క ఎకరాకైనా నీరిచ్చిందా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా 17 ప్రాజెక్టులు జాతికి అంకితం చేశామని చెబుతూ మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి వనరును అమ్ముకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. జన్మభూమి కమిటీల సభ్యులు గజదొంగలను మించిపోయారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్‌పీరా, ఆపార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గోగుల పుల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నపూస రామచంద్రారెడ్డి, సీనియర్‌ నాయకులు రవీంద్రారెడ్డిలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి

=m nu8*/0

మరిన్ని వార్తలు