వాస్తవాలు వెలుగులోకి

4 Aug, 2019 10:27 IST|Sakshi
స్వయం సహాయ సంఘాల సభ్యుల ఫ్యూరిఫికేషన్‌ నిర్వహిస్తున్న వెలుగు సిబ్బంది, కంప్యూటరీకరణ చేస్తున్న వెలుగు సిబ్బంది  

కొత్త ప్రభుత్వం వచ్చింది. సరికొత్త పథకాలు తీసుకువచ్చింది. ఎంతోమంది మహిళలకు ఆసరా కల్పించేందుకు తాజాగా పథకాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి పథకం సత్ఫలితాలనివ్వాలి. వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలి. అవినీతికి ఆస్కారం లేకుండా... పూర్తి పారదర్శకంగా... నిజమైన లబ్ధిదారులకే అవి చేరాలి. అందుకు పరిశీలన అవసరం. అందుకే ప్యూరిఫికేషన్‌ మొదలైంది. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్‌ మండలాల్లో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అసలైన సభ్యుల వివరాలు ఈ నెల 20లోగా కంప్యూటరీకరించే దిశగా పనులు కొనసాగుతున్నాయి.

సాక్షి, కురుపాం(విజయనగరం) : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం కావాలి. నిర్దేశించిన గడువులోగా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలి. తద్వారా సర్కారు లక్ష్యం నెరవేరాలి. దానికి తగ్గట్టుగా డ్వాక్రా సంఘాలు పారదర్శకంగా ఉండాలి. అందులో లబ్ధిదారులు యాక్టివ్‌గా ఉండాలి. కానీ మరణించినవారు... స్థానికంగా లేనివారు... ఇంకా సంఘాల్లో కొనసాగుతున్నట్టే రికార్డుల్లో ఉన్నాయి. దానివల్ల కొన్ని చోట్ల అక్రమాలు కూడా జరుగుతున్నాయి. లేనివారి పేర్లతో లబ్ధిపొందుతున్న వారూ ఉన్నారు. వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ప్యూరిఫికేషన్‌ పేరుతో వాటిని చక్కదిద్దేందుకు సర్కారు చర్యలు చేపట్టింది.  

మహిళా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకోసం పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తరువాత వాటిపై పథకాలు రూపొందించారు. నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాల మాఫీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, అమ్మ ఒడి, నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం కేటాయింపు వంటివాటిపై చర్యలు చేపట్టారు. ఇవన్నీ నిజమైన లబ్ధిదారులకు అందితేనే సర్కారు లక్ష్యం నెరవేరుతుంది. ఇందులో భాగంగా 2009 నుంచి ప్రభుత్వ పథకాలను పొందుతున్న స్వయం సహాయక సంఘాల్లో వాస్తవాలు తేల్చేందుకు సెర్ఫ్‌ అధికారుల సూచనలతో వెలుగు అధికారులు రంగంలోకి దిగారు.

గత ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టక పోవడం వల్ల పసుపు కుంకుమ వంటి విషయాల్లో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటి అవకాశం లేకుండా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల వివరాలు, వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్, సంఘాలకు చెందిన కొత్త తీర్మానం, రేషన్‌ కార్డులు, ఫోన్‌ నంబర్‌ వంటివి సేకరించి కంప్యూటరీకరణ చేస్తున్నారు. సంఘాల్లో సభ్యులు మృతి చెందినా, మరొక ప్రాంతానికి వెళ్లిపోయినా వారి వివరాలను తొలగిస్తున్నారు. ఇలా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది సబ్‌ప్లాన్‌ మండలాల్లో ఉన్న 12,600 సంఘాలకు చెందిన 99,602 మంది స్వయం సహాయక సంఘ సభ్యుల వివరాలను సేకరించేందుకు అన్ని వెలుగు కార్యాలయాల్లో వెలుగు ఏపీఎం, సీసీ, వీఓఏలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు నిమగ్నమయ్యారు.

చురుగ్గా ప్యూరిఫికేషన్‌
సెర్ఫ్‌ సీఈఓ, ఐటీడీఏ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు చురుగ్గా స్వయం సహాయక సంఘా ల ప్యూరిఫికేషన్‌ చర్యలు చేపడుతున్నాం. ఈ నెల 20వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాల్సి ఉంది. ప్యూరిఫికేషన్‌ వల్ల ఇక సంఘాల్లో ఇప్పటికే మృతి చెందినవారు, వేరొక చోటకు వెళ్లిపోయిన వారిని తొలగించాల్సి ఉంటుంది. దీనివల్ల నిజమైన అర్హులకే ప్రభుత్వ పథకాలు వెలుగు ద్వారా పొందే అవకాశం ఉంది.
– రామకృష్ణ, వెలుగు ఏపీఎం, కురుపాం మండలం 

మరిన్ని వార్తలు