'నన్ను అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా దిగుతా'

20 Sep, 2016 15:16 IST|Sakshi
'నన్ను అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా దిగుతా'

గుంటూరు: వెన్నుపోటుపొడవడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తుని ఘటనపై ఏపీ సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఆయన చంద్రబాబు పాలనా తీరును ఎండగట్టారు. చంద్రబాబు పాలన బకాసురుడి పాలనా మాదిరిగా ఉందన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం చంద్రబాబుకు కూనీ రాగం తీసినంత సులువని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు.

తుని ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒక వేళ ఈ ఘటన పేరుతో తనను అరెస్టు చేస్తే ప్రత్యక్షంగా కాపు ఉద్యమంలో పాల్గొంటానని భూమన స్పష్టం చేశారు. ఎవరో దుండగులు రైలును దగ్దం చేస్తే ఆ ఘటనను వైఎస్ఆర్ సీపీకి రుద్దుతున్నారని, ముద్రగడ పోరాటానికి తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతిక మద్దతు ఇచ్చినందుకే అది భరించలేక తమను, తమ పార్టీని వేధించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబులాంటి అరాచక శక్తి మరొకటి లేదన్నారు. ఇచ్చిన వాగ్దానం మరిచిపోవడం, వాగ్దానం అంటే నిన్నటి పలుకులా మార్చడం చంద్రబాబు తేలికగా చేసే పని అని విమర్శించారు. భారత రాజకీయాల్లోనే చంద్రబాబులాంటి రాక్షస పౌరుడు లేడని, అలాంటి రాజకీయ రాక్షసుడి చేతిలో ఆంధ్రప్రదేశ్ పాలన కొనసాగడం ఏపీ ప్రజల దురదృష్టం అని మండిపడ్డారు.


మరిన్ని వార్తలు