పరిటాల శ్రీరామ్‌ నుంచి ప్రాణహాని

27 Sep, 2019 11:19 IST|Sakshi
డీఎస్పీ రమాకాంత్‌కు ఫిర్యాదు చేస్తున్న నసనకోట ముత్యాలప్ప, తదితరులు  

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో రెండుసార్లు హత్యాయత్నం 

సాక్షి, ధర్మవరం(అనంతపురం)  : ‘‘టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా భార్య టీడీపీ హయాంలో మాజీ ఎంపీపీ. నేను ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరాను. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు, కుటుంబ సభ్యులు నాపై కక్షకట్టి హత్య చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తల్లిమడుగు, నసనకోట గ్రామాల్లో రెండుసార్లు నాపై హత్యాయత్నం చేశారు. నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని కోరారు. డీఎస్పీ రమాకాంత్‌ మాట్లాడుతూ ముత్యాలప్ప ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు