సాక్షి, విశాఖపట్నం: విశాఖ ప్రజలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నాలు చేస్తోంటే.. చంద్రబాబు విషపూరితం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తాము అభివృద్ధి చెందుతామన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో కలుగుతుందన్నారు. పరిపాలనా రాజధానిగా సేవలందించేందుకు విశాఖకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. ముంబై, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం విశాఖకే ఉందన్నారు. నాలుగు రకాల రవాణా మార్గాలు విశాఖకు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఐఐటీ నిపుణులు కూడా అమరావతిలో భారీ నిర్మాణాలు సరికాదని చెప్పారని వివరించారు.
అడగకుండానే ఇచ్చే నేత ఆయన..
అడిగినా ఇవ్వని నాయకుడు చంద్రబాబు అయితే.. అడగకుండానే ఇచ్చే నాయకుడు వైఎస్ జగన్ అని వీరభద్రరావు పేర్కొన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన అని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనపై పోటీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. పార్టీ ఓడిపోవడంతో పదవి కోసం ఎన్టీఆర్ చుట్టు తిరిగారని విమర్శించారు. కూతురు కోసం చంద్రబాబును పార్టీలోకి తీసుకుని చివరికి..అతని చేతిలోనే ఎన్టీఆర్ మోసపోయారని తెలిపారు.