చంద్రబాబు లూటీలపై సమగ్ర దర్యాప్తు జరపాలి

14 Feb, 2020 20:53 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు

సాక్షి, అనకాపల్లి: డొల్ల కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్ కో చేసిన లూటీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన పాపం చంద్రబాబును వెంటాడుతుందన్నారు. 20 ఏళ్లగా చంద్రబాబు నాయుడు వద్ద పనిచేసిన పీఏ పెండ్యాల శ్రీనివాసరావు రాసిన డైరీలు, మెయిల్స్‌ చంద్రబాబు చేసిన అవినీతికి  ప్రత్యక్ష సాక్ష్యాలు అని ఆయన పేర్కొన్నారు. (ఓటుకు నోటు కేసుపై కూడా నిగ్గు తేల్చాలి)

రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా తన ప్రాబల్యం పెరగాలన్నా ఆశతో ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తన అవినీతి సొమ్ము ఖర్చుపెట్టి ఎన్నికలను ప్రభావితం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని వీరభద్రరావు విమర్శించారు. చంద్రబాబు పీఏ కు నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించి పూర్తిగా నిజాలు రాబట్టాలన్నారు. నీతి, నిజాయితీతో ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కళంకం తెచ్చిన చంద్రబాబు.. టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!)

మరిన్ని వార్తలు