సీఎంకేనా పెన్షన్‌.. ఉద్యోగులకు వద్దా?

18 Sep, 2018 19:10 IST|Sakshi
గౌతంరెడ్డి (ఫైల్ ఫోటో)

సాక్షి, అమరావతి : ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఉండేవారికి పెన్షన్‌ ఇస్తూ.. ప్రజలందరికీ సేవ చేసేవారికి మాత్రం అర్థిక భద్రత కల్పించరా అంటూ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ప్రశ్నించారు. మీరు మాత్రం పెన్షన్‌ తీసుకుంటూ ఉద్యోగులకు ఇవ్వారా అని చంద్రబాబుపై మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే ఉద్యోగులే నిన్ను ఓడిస్తారని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉద్యోగస్తులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరకు చేస్తున్న ఉద్యమాలను చంద్రబాబు అణచివేస్తున్నారన్నారు. సీపీఎస్‌లో తెలంగాణలో 1,17,000, ఆంధ్రప్రదేశ్‌లో 1,83 వేల మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ విధానం వల్ల ఉద్యోగులకు ఏమాత్రం భద్రత లేదని.. ఉద్యమిస్తున్న వారిని నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన సూచనలకు కూడా పక్కదారి పట్టించే విధంగా సీపీఎస్‌ను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బెంగాల్‌, త్రిపురలో అమలు చేస్తున్న పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానంలో కట్టించుకుంటున్న డబ్బులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడిగా పెడుతున్నారని.. దాని వల్ల ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు