అవినీతిపరులా..జగన్‌ను విమర్శించేది

9 Jul, 2016 01:23 IST|Sakshi

చంద్రబాబు, ఉమా,  అచ్చెం నాయుడుపై సారథి ఫైర్


ఉయ్యూరు : పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో శుక్రవారం గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో టీడీపీ వ్యవహార తీరు తెలుగు ప్రజలు తలదించుకునేలా ఉందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులు గోలచేస్తూ, ఎదురుదాడికి దిగి ప్రజా గొంతు నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. మంద బలం ఉందిగదాఅని ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు, ఉమా, అచ్చెంనాయుడు నోరేసుకుని పడి ఎదురుదాడి చేసినంత మాత్రాన తప్పు ఒప్పవుతుందా అని ప్రశ్నించారు.


ఇష్టం వచ్చినట్లు ప్రతిపక్షంపై బురదచల్లితే ప్రజాకోర్టులో దోషులుగా మిగలాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దేవినేని ఉమా పిట్టలదొరలా తిరిగి నీటిపై రాద్ధాంతం చేశాడని ఎద్దేవా చేశారు. చేతకాని దద్దమ్మ ఉమా ఇరిగేషన్ చేపట్టబట్టే కృష్ణాడెల్టాలో రైతులకు నీటి కష్టాలు వచ్చాయని ధ్వజమెత్తారు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో టీడీపీ అకృత్యాలు, దోపిడీని ఎండగట్టి తగిన గుణపాఠం నేర్పుతామని వివరించారు.

 

మరిన్ని వార్తలు