మరోసారి ప్రజలను మోసం చేయకండి : మజ్జి

24 Dec, 2018 15:24 IST|Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో కలిశామని చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయకండని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. కేంద్రంతో సఖ్యంగా ఉంటూ మీ అవసరాలు తీర్చుకుని, రాష్ట్ర ప్రయోజనాలు జిల్లా ప్రయోజనాల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మీరు విడుదల చేసిస శ్వేత పత్రంలో ఇచ్చిన అంశాలు అన్నీ పూర్తిగా అవాస్తవమన్నారు.

'నిరుద్యోగులకు ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలను వివరించడానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 2015లో యువభేరి కార్యక్రమం నిర్వహించాము. యువభేరిలకు రవాణా సౌకర్యం కల్పించిన స్కూళ్లు, కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. పీడీ యాక్ట్‌లు అంటూ బెదిరించారు. మనం కేంద్ర ప్రభుత్వంతో పోరాడి, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేసి బీజేపీనీ దోషిగా నిల్చోపెడదాం అన్నాం. రాష్ట్ర హక్కుల కోసం రాజీనామా చేస్తే మన కోసం అడిగే వారు ఉండరని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఏం సాధించారు. ప్రత్యేక హోదా అవసరం లేదు అంటూ ప్యాకేజీ ఆహ్వానించారు. 2015, మార్చి10న మోదీని పొగుడుతూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడు శ్వేత పత్రం విడుదల చేశారు. ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను సమాయత్తం చేస్తాను అన్న పవన్ కళ్యాణ్  ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. బీజేపీ ఒక పక్క రాష్ట్రానికి అన్యాయం చేస్తే, పూర్తిగా అన్యాయం చేసిన ఘనత టీడీపీదే. మనం సఖ్యతతో అన్నీ సాధించుకోవాలి అంటూ మూడున్నర సంవత్సరాల పాటూ ఎన్‌డీఏలో ఉన్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు రాష్ట్ర ప్రయోజనాలు కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. మరో మూడు నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో మళ్లీ డ్రామాలు మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని దోషిగా నిలుచోబెడతారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో కలిశారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తాం అని ఎన్నికల ముందే చెప్పింది. కొత్తగా ఇప్పుడు చెప్పింది ఏమీలేదు' అంటూ మజ్జిశ్రీనివాసరావు నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు