ఎన్నికల తరుణంలో మహిళలు గుర్తొచ్చారా?

7 Jan, 2014 01:59 IST|Sakshi
ఎన్నికల తరుణంలో మహిళలు గుర్తొచ్చారా?
  • చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత సుచరిత ధ్వజం
  •  సాక్షి, హైదరాబాద్: తాను అధికారంలోకి వస్తే మద్య నిషేధం ఫైలుపై తొలి సంతకం చేస్తానంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉపనేత మేకతోటి సుచరిత మండిపడ్డారు. గతంలో సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని ఆమె నిలదీశారు. మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబుకు ఇప్పుడు మహిళలు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు ఎన్నో చేశానని చెప్పుకుంటున్న బాబు వాస్తవానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నపుడు వారిని ఎన్నో ఇబ్బందులకు, అవమానాలకు గురి చేశారని ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
     
    2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే మహిళా సాధికారతకు పాటు పడ్డారని ఆమె గుర్తు చేశారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సుచరిత సవాల్ విసిరారు. మహిళలు పోరాడి సాధించుకున్న మద్య నిషేధాన్ని ఎత్తివేసింది మీరు కాదా? మీ హయాంలో మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి బెల్ట్ షాపులను ప్రవేశపెట్టిన మాట అబద్ధమా?
     
    పీవీ ప్రధానిగా ఉన్నపుడు ప్రారంభమైన డ్వాక్రా పథకాన్ని మీరే ప్రారంభించినట్లు ప్రచారం చేసుకున్నారు.. కాదని చెప్పగలరా? తొమ్మిదేళ్ల పాలనలో మహిళల రుణాలపై కనీసం వడ్డీనైనా మాఫీ చేయని మాట నిజం కాదా? రాయితీలన్నా, సబ్సిడీలన్నా గిట్టక ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన రూ. 2 కిలో బియ్యం ధరను రూ. 5.50కు పెంచి పేదల కడుపు కొట్టలేదా? ఈ అంశాల్లో ఏ ఒక్కదానినైనా కాదనగలరా అని ఆమె బాబును ప్రశ్నించారు.
>
మరిన్ని వార్తలు