దళితులను దగా చేసేందుకే ‘దళిత తేజం’

4 Feb, 2018 12:40 IST|Sakshi

కడప కార్పొరేషన్‌: దళితులను దగా చేసి మళ్లీ ఓట్లు దండుకోవడానికే తెలుగుదేశం పార్టీ దళిత తేజం కార్యక్రమం నిర్వహిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు త్యాగరాజు, యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో ఎస్సీల ఓట్లు దండుకోవడానికి పెద్దమాదిగనవుతా అన్న  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని వారిని అవమాన పరిచారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు.

 ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టించారని, ట్రిపుల్‌ ఐటీల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళిత వాడల్లో ఉచిత విద్యుత్‌ ఇస్తుంటే, ఈ ప్రభుత్వం వచ్చాక దళితుల ఇళ్లకు కరెంటు కట్‌ చేసి, వారిపై కేసులు నమోదు చేయిస్తోందని మండిపడ్డారు. ఇన్ని విధాలుగా దళితులను దగా చేస్తున్న తెలుగుదేశం పార్టీకి దళిత తేజం కార్యక్రమం నిర్వహించే అర్హత ఉందా అని సూటిగా ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే టీడీపీ నాయకులకు దళితుతు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు