చిత్తూరు / కార్వేటినగరం : ముఖ్యమంత్రి చంద్రబాబు తాను చెప్పే అబద్ధాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గంగా ధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అబద్ధాలతో అందలం ఎక్కిన బాబు అరాచకాలు కూడా అంతర్జాతీయ స్థాయికి పాకాయన్నారు. అధికారం కోసం బాబు బరితెగిస్తారని, ఆయనకు కావాల్సిం ది అధికారం తప్ప ప్రజల బాగోగులు కాదని విమర్శించారు, నాడు కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తి పోసిన బాబు నేడు ఆయన స్వార్థం కోసం అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ జాతీయ పార్టీ అన్న చంద్రబాబు దమ్ము, ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా పోటీచేయాలని సవాల్ విసిరారు. టీడీపీ పాలనలో అధికారులు ప్రజాసమస్యలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలు, మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతిలో అధికారులు కీలుబొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికారులు పార్టీలకు అతీతంగా పారదర్శకంగా వ్యవహరించి ప్రజల మన్నలను పొందాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ఆదరించి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.