కోటి ఆత్మార్పణతోనైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలి

13 Aug, 2015 03:37 IST|Sakshi
కోటి భార్యకు ఆర్థికసాయం అందిస్తున్న పెద్దిరెడ్డి , భూమన, నారాయణస్వామి

- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి, భూమన
- కోటి కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం
- గాయాలపాలైన శేషాద్రికి రూ. 50 వేలు అందజేత
 
తిరుపతి మంగళం:
ముని కామకోటి ఆత్మాహుతితోనైనా ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 8వ తేదీన మునికోటి నిప్పంటించుకుని ఆత్మాహుతి చేసుకున్న విషయం తెలిసిందే.

కోటి కుటుంబాన్ని మంగళవారం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సందర్భంగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆ హామీ మేరకు వైఎస్ జగన్ ఆదేశాలపై కోటి కుటుంబానికి పెద్దిరెడ్డి, భూమన రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందించారు. బుధవారం ఉదయం కోటి ఇంటికి వెళ్లి అతని తమ్ముడు మురళికి రూ. 1.5 లక్షలు, కోటి భార్య దాక్షాయణికి రూ. 1.5 లక్షలు అందించారు. కోటిని కాపాడబోయి గాయాలపాలైన శేషాద్రికి రూ. 50 వేలు ఆర్థిక సాయాన్ని పెద్దిరెడ్డి, భూమన, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి సంయుక్తంగా అందించారు.

మరిన్ని వార్తలు