కరుణ కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం

7 Aug, 2018 04:25 IST|Sakshi
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్, కనిమొళిని వాకబు చేస్తున్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ

కరుణానిధిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి ప్రతినిధి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పూర్తిగా కోలుకుని.. ప్రజా జీవితంలోకి రావాలని  దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఆకాంక్షించారు.  పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని  వారు పరామర్శించారు. సోమవారం రాత్రి 8.00 గంటలకు కావేరి ఆస్పత్రికి చేరుకున్న నేతలు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, ఎంపీ కనిమొళిని కలుసుకుని కరుణానిధి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకే పార్టీ ప్రతినిధులుగా కరుణను పరామర్శించేందుకు  వచ్చామని, స్టాలిన్, కనిమొళిని కలుసుకున్నామని ఆయన చెప్పారు. కరుణ ఆరోగ్యం కొంత సంక్లిష్టంగా ఉన్నా.. భగవంతుడి దయవల్ల ఆయన  కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కరుణానిధి వంటి మహోన్నత నేత సేవలు తమిళనాడుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ  మరికొన్ని రోజుల్లో కరుణ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిచ్ఛార్జ్‌ కావాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో తెలుగు ప్రముఖుడు జనార్దన్‌ రెడ్డి,  వైఎస్‌ అనిల్‌రెడ్డి వారితో ఉన్నారు. 

మరిన్ని వార్తలు