బెంగళూరు నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు కలిశారు. గురువారం ఉదయం బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన జగన్ తన నివాసంలో ఉదయం నుంచీ రోజంతా సందర్శకులను కలుసుకుంటూ బిజీ బిజీగా గడిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనతో భేటీ అయినపుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
పలు జిల్లాల్లో గురువారం నుంచే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను త్రిసభ్య కమిటీలు సమీక్షిస్తూ ఉండటంతో అక్కడి పరిస్థితులను కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో తన కోసం వచ్చిన సాధారణ సందర్శకులు, పార్టీ కార్యకర్తలను కూడా కలుసుకుని స్థానిక పరిస్థితులపై వాకబు చేశా రు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్మాణంపై దృష్టిని సారించాలని పార్టీ అధినేత వారికి సూచించారు.