సుజనా చౌదరి ఎకనమిక్ టెర్రరిస్ట్‌: సీఆర్‌

5 Aug, 2019 17:40 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య

సాక్షి, అమరావతి: సొంత ప్రయోజనాలు కోసం పాకులాడే సుజనా చౌదరి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం విస్మయం కలిగిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య(సీఆర్‌) అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సుజానా చౌదరి బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్‌ అని ఆరోపించారు. సుజనా లాంటి వారు పక్కన చేరి చంద్రబాబును ముంచేశారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న ప్రతి పనిని మేనిఫెస్టోలో చెప్పే చేశామని తెలిపారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు రాలేదని.. వచ్చుంటే ప్రజలపై మరింత భారం పడేదన్నారు. పీపీఏలను సమీక్ష చేస్తే తప్పేంటన్నారు. చంద్రబాబు ప్రజల గురించి ఆలోచిస్తారా, కార్పొరేట్ల గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. పీపీఏల సమీక్ష జరిగితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని చంద్రబాబుకు భయమా అని ఎద్దేవా చేశారు.

డెవిల్స్‌ అడ్వకేటుగా ఉండొద్దు
పీపుల్స్ అడ్వకేటుగా ఉండాలి కానీ.. డెవిల్స్ అడ్వకేటుగా ఉండకూడదని చంద్రబాబుకు హితవు పలికారు. అన్నక్యాంటీన్లు మేడిపండులాగా ఉన్నాయని.. తవ్వేకొద్దీ దోపిడీ బయటపడుతుండటంతో ప్రక్షాళన చేస్తున్నామన్నారు. దోపిడీని అరికడుతుంటే హర్షించాల్సిన బీజేపీ.. విమర్శలు చేయడం సరికాదన్నారు. నిన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన బీజేపీ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుందో అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ కాళ్లు చేతులు విరిగాయి కాబట్టి ఆ గ్యాపులో దూరేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ఎదగాలని ప్రయత్నించడంలో తప్పు లేదని.. కాని ఎకనమిక్ టెర్రరిస్టులను, ఫ్యాక్షన్ లీడర్లను బీజేపీ చేర్చుకుంటోందని రామచంద్రయ్య ఆక్షేపించారు.
 

మరిన్ని వార్తలు