'చంద్రబాబు చెవుల్లో పువ్వులు పెడుతున్నారు'

20 Aug, 2017 18:21 IST|Sakshi
'చంద్రబాబు చెవుల్లో పువ్వులు పెడుతున్నారు'

నంద్యాల: ముస్లిం ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెట్టాలని సీఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ నేతలు మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను మభ్యపరచడానికే.. ఆ పార్టీ నేతలు తమ కండువాలతో ప్రచారం చేయొద్దని చెప్తున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబును మైనారిటీలు ఎవ్వరూ నమ్మబోరని స్పష్టం చేశారు. 85శాతం మైనారిటీలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వెంటే ఉన్నారని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ముస్తఫా, రెహ్మాన్‌ తదితరులు ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

ముస్లిం ప్రజలకు నాలుగుశాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిదేనని వారు గుర్తుచేశారు. ముస్లింలపై దొంగ ప్రేమ ప్రదర్శిస్తున్న చంద్రబాబు మాత్రం తన కేబినెట్‌లో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా చోటు కల్పించలేదని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో యోగిఆదిత్యనాథ్‌ నేతృత్వంలో బీజేపీ సర్కారు ఉన్నప్పటికీ, అక్కడసైతం ఒక ముస్లిం నాయకుడికి మంత్రి పదవి ఇచ్చారని, కానీ, అంతకన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఒంటిరిగా పోరాడేశక్తి చంద్రబాబుకు లేదని, అందుకే ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు రాదని, బాబు పోతేనే జాబు వస్తుందని వ్యాఖ్యానించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామని చంద్రబాబు చెప్తున్నారని, కానీ, రెండు గదుల్లో మాత్రమే ఉర్దూ వర్సిటీ నడుస్తున్న దారుణమైన పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.