జూమ్‌లో తప్ప చంద్రబాబు ఎక్కడా కనిపించరు..

23 May, 2020 19:31 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: దేశంలో  ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని గొప్ప తీర్పు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలిచ్చిన చారిత్రాత్మక రోజు మే 23 అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఆయన శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌కు అధికారం ఇస్తే సంక్షేమ పాలన అందిస్తారని ప్రజలంతా నమ్మి చారిత్రాత్మక విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ‘‘ఎన్నికల‌ ముందు మేనిఫెస్డోను‌ ప్రకటించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చి మేనిఫెస్టోను విస్మరించిన ప్రభుత్వాలను చూశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల హామీలను అమలు చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. అన్ని‌ ప్రభుత్వ కార్యాలయాల్లో మేనిఫెస్టో ఉంచాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరేవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని’’ అమర్‌నాథ్‌ కొనియాడారు.
(ఏడాది పాలన.. 6 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు)

విపత్తు సమయంలోనూ సంక్షేమం
కరోనా కష్ట సమయంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అమ్మ ఒడి, మహిళలకి సున్నా వడ్డీ లాంటి ఎన్నో సంక్షేమ‌ పథకాలను సీఎం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పడిన కష్టాలు ఎవరూ పడి ఉండరన్నారు. ఆయన కష్టంతో వైఎస్సార్‌సీపీ 151 సీట్లతో చరిత్ర సృష్టించిందన్నారు. పక్క రాష్ట్రంలో ఒక ఘటన జరిగితే రాష్ట్రంలో అటువంటి సంఘటనలు జరగకూడదని దిశ చట్టాన్ని సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే దాడి చేస్తే సెటిల్ మెంట్ చేయడాన్ని చూశామని గుర్తు చేశారు.
(‘జూమ్‌’లో చర్చకు సిద్ధం.. మంత్రి బొత్స సవాల్‌)

మూడు నెలులుగా ఎక్కడికి పారిపోయారు..
‘‘రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. ప్రతిపక్ష నేత మూడు నెలలుగా ఎక్కడికి పారిపోయారు. చంద్రబాబు జూమ్ లో తప్పితే ఎక్కడా కనిపించరు. ఇసుక దోపిడీ, కాల్‌ మనీ సెక్స్ రాకెట్లు.. ఇలా దోపిడీ పాలన నుంచి సంక్షేమ వైపు ఆంధ్రప్రదేశ్‌ అడుగులు వేసింది. దేశంలోనే ఏపీ ఇతర రాష్డ్రాలకి ఆదర్శంగా నిలబడింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని కుట్రలు చేస్తున్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులంటే కోర్టుకి వెళ్లి అడ్డుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ కి మంచిపేరు రాకూడదని ప్రతీ విషయంలోనూ అడ్డుపడుతున్నారంటూ’  అమర్‌నాథ్‌ మండిపడ్డారు.

తీర్పులు బాధ కలిగిస్తున్నాయి..
చంద్రబాబు హైదరాబాద్‌ను విడిచి.. మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు,లోకేష్‌లను కరోనాను మించిన వైరస్‌లుగా ఆయన అభివర్ణించారు. నారా లోకేష్ చేసిన ట్వీట్లపై కోర్టు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాబోయే రోజుల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని, ఆరు నెలలలోపు మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని ప్రజలకిచ్చిన మాటను వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారన్నారు. గత కొన్ని రోజులగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు బాధ కలిగిస్తున్నాయన్నారు. వ్యక్తిగతంగా తాను విభేదిస్తున్నానని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు