టీడీపీ నేతలది సైంధవ పాత్ర

7 Jul, 2020 16:32 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

సాక్షి, తాడేపల్లి: పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని, వాటిని అడ్డుకోవాలని హైకోర్టులో నాలుగు పిటిషన్లు వేశారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు తన హయాంలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? హైదరాబాద్‌లో మాత్రం ఆయన ఇంద్ర భవనం కట్టుకున్నారు. పేదలంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం’’ అంటూ జోగి రమేష్‌ నిలదీశారు.

వైఎస్సార్‌ పాలన అనగానే సంక్షేమ కార్యక్రమాలు గుర్తుకు వస్తాయని, కానీ చంద్రబాబు పాలన చూస్తే సర్వం అవినీతి అవినీతిమయం అని, భూ దందాలు, విశాఖ కుంభకోణాలు గుర్తుకొస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కరోనా విపత్తు సమయంలో కూడా సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపడేలా 108,104 వాహనాలను సీఎం ప్రారంభించారని పేర్కొన్నారు. ‘‘ప్రతిపక్షం అంటే ప్రజల కష్టాలు చూడాలి కానీ, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఆపాలి అని కుట్రలు చేస్తున్నారు. ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని’’ జోగి రమేష్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు