కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానండి..

29 Dec, 2019 20:01 IST|Sakshi

సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా వివిధ హోదాలో పనిచేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. కోటలో కూర్చోని రాజకీయాలు చేయడం మానుకోండని హితవు పలికారు. చరిత్రలు చెప్పడం అందరికీ తెలుసని, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై స్పష్టమైన విధానాన్ని చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటు కారణంగా ఇక్కడ ప్రజలు చాలా ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల కాలం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజలు జీవనాన్ని నెట్టుకొస్తున్నారని అన్నారు. 

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృది జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రాజధాని బొమ్మలు చూపించి చివరికి రేకుల షెడ్డులో ఉన్నతాధికారులను కూర్చొబెట్టి పాలన సాగించారని మండిపడ్డారు. రాజధాని ముసుగులో టీడీపీ నాయకులు రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు