బీసీలపై చంద్రబాబు మొసలికన్నీరు

29 May, 2020 11:12 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

సాక్షి,తాడేపల్లి: బీసీలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మొసలికన్నీరు కారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విమర్శించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహానాడు వేదికగా బీసీలను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఆయన మోసపూరిత మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని.. వారిని అనేక సందర్భాల్లో అవమానించారని పార్థసారధి ధ్వజమెత్తారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి)

బీసీలకు గౌరవం పెరిగింది..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే బీసీలకు శ్వాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో బీసీల గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెనతో రాష్ట్రంలోని లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందన్నారు. పేదల సొంతింటి కలను సీఎం జగన్‌ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24వేలు.. నాయీ బ్రాహ్మణులు, రజకులకు కూడా పది వేలు ఇస్తున్నారని తెలిపారు.పెద్ద ఎత్తున బీసీ మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. (అండమాన్‌లో ఆర్తనాదాలు) 

చంద్రబాబు.. కత్తెర్లు తప్ప మరేమీ ఇవ్వలేదు..
గత టీడీపీ పాలనలో నాయీబ్రాహ్మణుల తోక కత్తిరిస్తానని చంద్రబాబు హెచ్చరించారని పార్థసారధి గుర్తుచేశారు. మత్స్యకారులు తోలు తిస్తానని భయపెట్టారని.. బీసీలు జడ్జిలుగా పనికి రారని నివేదిక కోర్టులకు ఇచ్చారని ఆయన దుయ్యబట్టారు. ఆదరణ పథకం పేరుతో కత్తెర్లు తప్ప మరేమీ ఇవ్వలేదన్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను బానిసలుగా గ్రామాల్లో టీడీపీ నేతలు చూసేవారని.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు తమ ఇంటి చుట్టూ కాళ్ళు అరిగేలా తిప్పుకునేవారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గత ఐదేళ్లలో బీసీల కోసం 50 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి ఐదువేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. బీసీల సంక్షేమానికి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వైఎస్‌ జగన్‌ 15 వేల కోట్లు ఖర్చు చేశారని పార్థసారధి వివరించారు.

అందుకే చంద్రబాబు అరుపులు.. 
‘‘చంద్రబాబుకు తన కుమారుడు లోకేష్‌ మీద నమ్మకం లేక అందరి మీద అరుస్తున్నారు. ఆయన అరిస్తే సింహం అరిసినట్టు కాదు.. నక్క అరిస్తే సింహం గర్జించినట్లు కాదు. నక్క అరిసినట్లే అవుతుందుని’’ ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారని పార్థసారధి నిప్పులు చెరిగారు.

>
మరిన్ని వార్తలు