‘సంక్షేమాన్ని సమపాళ్లలో అందించారు’

8 Jul, 2020 12:42 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

సాక్షి, కృష్ణా జిల్లా: మహానేత, తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తండ్రిని మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ జయంతిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కంకిపాడు మండలం ప్రొద్దుటూరు గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పార్థసారథి పాల్గొన్నారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌తో కలిసి ప్రధాన రహదారి నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు ఎడ్ల బండిపై ర్యాలీగా వచ్చి.. వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు.(అపర భగీరథుడు.. తండ్రికి తగ్గ తనయుడు! )

ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయం దండగ.. ఐటీ అభివృద్ధితోనే పండగ అన్న వ్యక్తి చంద్రబాబు. టీడీపీ పాలనలో రైతు సంక్షేమాన్ని గాలికొదిలేశారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే రైతులకు మంచి రోజులు వచ్చాయి. అనేక ప్రాజెక్టులు పురుడు పోసుకొన్నాయి. రైతు సంక్షేమానికి మెరుగైన బాటలు పడ్డాయి. పేదలకు ఆరోగ్య రక్ష , ఉన్నత చదువులు, రైతు సంక్షేమాన్ని సమపాళ్లలో అందించారు. తండ్రికి తనయుడైన సీఎం వైఎస్‌ జగన్‌..  మాటల టీడీపీ ప్రభుత్వానికి , చేతల వైఎస్సార్‌ సీపీ పాలనకు ఏడాదిలోనే వ్యత్యాసం చూపించారు. ఆయనకు ఉన్న జనాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఆటంకాలు సృష్టించే కుట్రలు చేస్తున్నారు. టీడీపీ విధ్వంసకర రాజకీయాలకు పచ్చమీడియా వత్తాసు పలుకుతోంది. గతంలో వైఎస్సార్‌ సీపీ వాళ్ళకి పెన్షన్ తొలగించిన టీడీపీ నేతకు ఈ రోజు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మాది. 30 లక్షల మందికి ఇంటి స్థలాల పట్టాలు సిద్ధం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’’ అని పేర్కొన్నారు.(ప్రజల మనిషి.. ప్రజలు మెచ్చిన మనిషి )

మరిన్ని వార్తలు