నిరుద్యోగులు ఎవరి మాటలు నమ్మొద్దు: రక్షణ నిధి

28 Aug, 2019 16:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇసుక విషయంలో తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్లనుంది అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో టీడీపీ నేతలు పందికొక్కుల్లా ఇసుక, మట్టిని దోచుకుతిన్నారని మండి పడ్డారు. మాజీ స్పీకర్‌ కోడెల అసెంబ్లీ ఫర్నీచర్‌ చోరికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. గతంలో టీడీపీ నాయకులు తప్పు చేస్తే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్పీ, కలెక్టర్లకు సూచించేవారని ఆరోపించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పు చేసిన వారిని ఎవరిని వదలొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. కట్టలేరు బ్రిడ్జీని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు ప్రకటనలు గుప్పించారు.. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదని రక్షణ నిధి ఆరోపించారు.

గత పాలకుల్లా తాము మోసపూరిత వాగ్దానాలు చేయమని.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రక్షణ నిధి స్పష్టం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉందని తెలిపారు. నిరుద్యోగులు సచివాలయ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. గ్రామ వలంటీర్లు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికే కానీ జన్మభూమి కమిటీల్లా దోచుకోవడానికి కాదని రక్షణ నిధి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు