బూరెలతో మొక్కు తీర్చుకున్నారు..

11 Aug, 2019 14:21 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు ఆయనపై తమకున్న అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని చాలా మంది తమ ఇష్ట దైవాలకు మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో ఇప్పుడు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని పీరా రామచంద్రపురం గ్రామానికి చెందిన చిర్ల సత్తిరెడ్డి, పద్మావతి దంపతులు తమ కోరిక నెరవేరడంతో ఆదివారం మొక్కు చెల్లించుకున్నారు. 

వివరాల్లోకి వెళ్లితే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెలతో తులాభారం వేస్తామని సత్తిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. ఇప్పుడు వారి మొక్కు ఫలించడంతో అనపర్తి వీరుళ్లమగుడి ప్రాంగణంలో ఆదివారం 500 బూరెలతో అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి తులభారం వేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ అభిమానులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు