ఆటోవాలాలు బాధ్యతగా వ్యవహరించండి: కన్నబాబు

4 Oct, 2019 15:55 IST|Sakshi

వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద ఆటోవాలాలకు రూ. 10వేల ఆర్థిక సాయం

సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఆటో డ్రైవర్లు సద్వివినియోగం చేసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ప్రమాదాల వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని... రహదారి ప్రమాదాలను తగ్గించాల్సిన బాధ్యత ఆటోవాలాలపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తున్నందున ఆటోవాలాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద ఆటోవాలాలకు రూ. 10వేల చొప్పున మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార‍్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, అనిల్‌ కుమార్‌, జగన్మోహన్‌రావు.. కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంతి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ మాట తప్పకుండా మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే త్వరలోనే అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లల్ని బడికి పంపితే వారి తల్లికి రూ. 15వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. నాలుగు నెలల్లో సంక్షేమ పథకాలను అమలు చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌ అన్నారు. రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ. 10వేలు ఆర్థికసాయం త్వరలో  అందిస్తామని పేర్కొన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ ప్రారంభించారని, ప్రతి ఇంటా చిరునవ్వులు ఉండాలన్న ఆకాంక్షతో వైఎస్సార్‌ వాహనమిత్ర ప్రారంభించామని అన్నారు. అలాగే ఆటోడ్రైవర్లంతా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు
ఆటో ​కార్మికులు ప్రమాదాల శాతం తగ్గించి.. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ న్నారు. కులం, మతం రంగు చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. లక్ష ముఫ్పై వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎందే అన్నారు. దీనిపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న నికృష్ట చర్యలు మానుకోవాలని ఆయన అన్నారు.

ఇక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాల సాధన కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందే అన్ని వర్గాల  కష్టాన్ని చూశారని, పది సంవత్సరాల పోరాటం ఈరోజు కోసమే అన్నారు. సీఎం పాదయాత్రలో అన్ని వర్గాల జీవన విధానాన్ని తెలుసుకున్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నతీరు చూసి టీడీపీ నేతలు ఓర్వలేక ముఠా నాయకులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు, రైతుల కష్టాలు తెలుసుకున్న నేత సీఎం జగన్‌ అని.. కృష్ణాజిల్లాలో 20 వేల కుటుంబాలలో ఆయన ఆనందం నింపారన్నారు.

ఈ మాసం అంతా కార్మిక మాసం
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1 లక్ష 75 వేల కార్మికుల కుటుంబాలలో సీఎం వెలుగులు నింపారని, అక్టోబర్‌ మాసం అంతా కార్మిక మాసంగా మార్చారని అన్నారు. రైతులకు మేలు చేకూర్చే రైతు భరోసా సైతం అక్టోబర్‌లోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు పేద ప్రజలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.  సీఎం జగన్‌ నవరత్నాల ద్వారా కార్మికులకు, మహిళలకు, యువకులకు పెద్ద పీట వేశారన్నారు. తెలంగాణ వైపు వెళ్లే వాహనదారుల నుంచి ట్యాక్స్‌ రూ. 2 వేలు వసూలు చేస్తున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. సీఎం లబ్దిదారుల కోసం వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని అక్టోబర్‌ నెలాఖరు వరకు పొడగించారని.. ఆటో, టాక్సీ కార్మికులందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను మాట్లాడుతూ.. నేడు వాహన మిత్ర కార్యక్రమానికి నాంది పలకడంతో రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణ ఆధ్యాయం ప్రారంభమైదని అన్నారు. ఆటో కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పాదయాత్రలో తెలుసుకుని ఇచ్చిన హామీలను నిలుపుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలోనే 4 లక్షల ఉద్యోగాల కల్పన చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు