తాత్కాలికానికి ఇంత దుబారా?

15 Feb, 2017 02:24 IST|Sakshi
తాత్కాలికానికి ఇంత దుబారా?

రూ.220 కోట్ల అంచనాల సచివాలయానికి రూ. 1,200 కోట్లు ఖర్చు పెట్టారు
అసెంబ్లీ నిర్మాణ పనులు పరిశీలించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు


సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: తాత్కాలిక సచివాలయం అంటూనే వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయానికి రూ. 220 కోట్ల అంచనాలతో మొదలుపెట్టి ఇప్పటికి రూ.1,200 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బూడి ముత్యాలనాయుడు బృందం మంగళవారం సచివాలయంలో నిర్మాణంలో ఉన్న అసెంబ్లీ, శాసన మండలి హాలును పరిశీలించారు.

అనంతరం పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ, మండలి భవనాలను పరిశీలించి రావాలన్న తమ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో తాము వచ్చినట్టు చెప్పారు.  తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మా ణానికి రూ. 1,200 కోట్లు ఎలా ఖర్చు పెట్టా రని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో విపక్ష నాయకుడికి కనీసం పేషీ కూడా కేటాయించ లేదని విమర్శించారు. ఈ విషయంలో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఏపీ సీఎం చంద్రబాబు పునరాలోచించాలన్నారు.
   
‘హైదరాబాద్‌లో బాబుకు ఖరీదైన ఇల్లు’
ఇక్కడ అక్రమ నిర్మాణంలో ఉంటున్న  బాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో  వందల కోట్లు పెట్టి సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారని ఆర్కే చెప్పారు. విపక్ష నేత వైఎస్‌ జగన్‌ నెలలో 20 రోజులకు పైగా రాష్ట్ర ప్రజల మధ్య గడుపుతున్నారని ఆర్కే వివరించారు. విజయవాడలో బృందాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బొప్పన భవకుమార్‌ కలిశారు. కాగా విపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. వారి కదలికలను వీడియో తీసింది.

మరిన్ని వార్తలు