సంతబేరం.. ఎంతఘోరం

25 Feb, 2016 01:36 IST|Sakshi

కొందరు వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకోవడంపై జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీనిని సంతబేరంగా అభివర్ణించారు. చంద్రబాబు విలువలకు తిలోదకాలిచ్చి, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కుట్రలు, కుతంత్రాలకు బాబు మారుపేరు అని విమర్శించారు. జిల్లా ప్రజలు ఎవరూ బాబును నమ్మరని తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకోవడంతోనే బాబు పతనం ఆరంభం అయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ను అవకాశవాదిగా పేర్కొన్నారు. -సాక్షి ప్రతినిధి, తిరుపతి
 
బాబుకు విలువలు లేవు
చంద్రబాబుకు నీతినియమాలు, విలువలు లేవు. పక్కా అవకాశ వాది. పదవికోసం ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారు. శవాలపై నడుచుకుంటూ పోయినా పర్వాలేదు, పదవి కావాలనే మనస్తత్వం ఆయనది. పార్టీ ఫిరాయించేవారిది కాదు.. వారిని పార్టీలోకి రమ్మని ప్రోత్సహించడమే తప్పు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి మారుతుంటే ప్రజాస్వామ్య విలువలు ఖూనీ అయ్యాయంటూ గొంతు చించుకుని అరుస్తారు. ఏపీలో మాత్రం అవకాశవాద రాజకీయాలు చేస్తారు. ఎన్టీ రామారావుపైన చెప్పులు వేయించినప్పుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.
 - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే
 
బాబు పతనం ప్రారంభమైంది
మా ఎమ్మెల్యేలను చేర్చుకోవడంతోనే బాబూ నీ పతనం ప్రారం భమైంది. ఇప్పుడు మీ పార్టీ లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వ కుం డా ఉంచుకోగలరా? పోనీ మం త్రి పదవులిస్తే మీ పార్టీ సీనియర్లు తిరుగుబాటు చేయరా? ఎన్‌టీఆర్‌ను ఎలా పదవి నుంచి దించారో.. మీకూ అదే గతి పడుతుంది.    - చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే
 
ప్రలోభపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
ఎమ్మెల్యేలను, నాయకులను ప్రలోభపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 1983లోనే  సమితి ప్రెసిడెంట్‌గా గెలిచిన నాకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, డబ్బులు ఇస్తానని ఎరవేశారు. ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని అప్పుడే చెప్పాను. ఆయన నైజంలో మార్పు లేదు.  దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిం చి గెలిపించుకో. పార్టీ మారిన వారు చరిత్ర హీనులవుతారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బులు లేవనే బాబుకు ఎమ్మెల్యేలను కొనేందుకు ఎక్కడ నుంచి వచ్చాయి? పార్టీని వీడిన ఎమ్మెల్యేలు క్షోభించేరోజు దగ్గరలో ఉంది. పిచ్చివారు కూడా ఇలాంటి పనులు చేయరు.  
 -కె. నారాయణస్వామి, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే
 
కుతంత్రాలకు మారుపేరు
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు మారు పేరు. జిల్లాలో ఆయనను ఎవ్వరూ నమ్మరు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా జిల్లాలోని 8 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వీడే ప్రసక్తే లేదు. ఎవరైతే పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారో వారిది రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమే. భవిష్యత్తు ఉండదు. ప్రజలు వారిని తిరస్కరిస్తారు.
 -  చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే
 
హుందాగా వ్యవహరించాలి
ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలి. నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. ఇలా దిగజారుడుతనంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ఏపార్టీకీ శ్రేయస్కరం కాదు. పార్టీలు మారే ఎమ్మెల్యేలను ప్రజలు విశ్వసించరు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.   
 -ఎన్.అమరనాథ రెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే
 
వెన్నుపోటు ఆయన నైజం
 వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. డబ్బులు ఎరగా వేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుంటున్నారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలి. ఎస్సీలను తక్కువ చేసి మాట్లాడిన బాబు చివరకు దళిత ఎమ్మెల్యేలను కొనుక్కునే పరిస్థితికి దిగజారారు.  దిగజారిపోయి ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోవద్దు. ‘‘మాకు కోట్లు వద్దు.. రాజన్న, జగనన్న మాపై చూపే ప్రేమ చాలు.. నేను ఎన్నటీకి పార్టీ వీడే ప్రసక్తే లేదు’’.                
  - డాక్టర్ సునీల్‌కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే
 
 

మరిన్ని వార్తలు