ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రికి లేఖ రాసిన ఎంపీ బాలశౌరి

31 Aug, 2019 13:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రా బ్యాంకును, యూనియన్‌ బ్యాంకులో విలీనం చేయవద్దంటూ మచిలీపట్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బాలశౌరి శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వుందన్నారు. స్వాతంత్ర్యం రాక మునుపే 90 ఏళ్ల క్రితం ఆంధ్ర ప్రాంతానికి చెందిన పట్టాభి రామయ్య ఆంధ్ర బ్యాంకును స్థాపించారన్నారు. ఇంతటి ప్రాచీన చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకుతో కలపవద్దని లేఖలో విన్నవించారు. తెలుగు ప్రజల మనోభావాలకు అద్దం పట్టే ఈ సునిశితమైన అంశంపై నిర్మలా సీతారామన్‌ మరోసారి ఆలోచించాలని కోరారు.

అదే విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో  ఆంధ్రా బ్యాంకును విలీనం చేయాల్సి వస్తే.. విలీనమైన బ్యాంకుకు ‘ఆంధ్రా బ్యాంకు’గానే నామకరణం చేయాలని బాలశౌరి ప్రతిపాదించారు. అంతేకాక సదరు బ్యాంకు ప్రధాన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలోనే ఈ అంశంపై ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్‌తో పాటు బ్యాంకింగ్‌ సెక్రటరీని కలుస్తానన్నని బాలశౌరి పేర్కొన్నారు.
(చదవండి: బ్యాంకింగ్‌ బాహుబలి!)

మరిన్ని వార్తలు