ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రండి: ఎంపీ విజయసాయిరెడ్డి

23 Aug, 2019 18:20 IST|Sakshi

ఢిల్లీ: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి శుక్రవారం 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆహ్వానించారు. అదే విధంగా ఆహ్వాన లేఖను ఆయనకు అందజేశారు. కాగా ముఖ్యమంత్రి జగన్‌ ఆహ్వానంపై ఎన్‌కే సింగ్‌ సానుకూలంగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తానని పేర్కొనట్లు విజయసాయరెడ్డి మీడియాకు తెలిపారు.

అంతకు ముందు కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి హరి సిమ్రత్ కౌర్ను విజయసాయి రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా  జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటలు ఉన్న నేపథ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని హరి సిమ్రత్‌ కౌర్‌కు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  నరేంద్ర సింగ్ తోమార్‌తో భేటీ అయిన విజయసాయి రెడ్డి అనంతపురం జిల్లాకు పశుగ్రాసం పంపాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలో వర్షాలు లేక  తీవ్ర కరువు ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించాల్సిన పరిస్థితి వస్తోందని.. కేంద్రం సత్వరమే స్పందించి  జిల్లాకు రెండు నెలలకు సరిపడ పశుగ్రాసం పంపించాలని తోమార్‌ను కోరారు. 
 

మరిన్ని వార్తలు