జగన్‌ పాలనలో విశాఖకు మహర్దశ

31 Oct, 2019 18:38 IST|Sakshi

రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విశాఖకు మహర్దశ పట్టనుందని రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలు పండగలా నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. తెలుగు భాష ప్రాధాన్యత తెలిసేలా ఈ సారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతామన్నారు. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం.. ఆంధ్ర రాష్ట్ర దినోత్సవాలను మరిచి పోయిందన్నారు. ‘నవ నిర్మాణ దీక్షల పేరిట బెంజ్ సర్కిల్ లో ట్రాఫిక్ కు అంతరాయం కల్గించడం మినహా మరో పని చేయలేదని’ ఎద్దేవా చేశారు.

ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవ్‌..
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ విభాగంలో రూ.68వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సుల గురించి కామర్స్ శాఖకు లేఖ రాస్తే వివరాలు లేవని చెప్పారని తెలిపారు. టీడీపీ హయాంలో విశాఖను భూ కుంభకోణాలకు నిలయంగా మార్చారని ధ్వజమెత్తారు. విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ విచారణ నిష్ఫక్షపాతంగా జరుగుతుందన్నారు. భూ కుంభకోణాల్లో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

కమిటీ నివేదిక బట్టి రాజధానిపై నిర్ణయం..
గత ప్రభుత్వం సిట్ నివేదిక ను బయట పెట్టలేదని.. ఇప్పుడు బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. సిట్ విచారణ పరిధిని పెంచే ఆలోచన వుందని వెల్లడించారు. అనకాపల్లి, యలమంచిలి ప్రాంతాలను కూడా సిట్‌ పరిధిలోకి తీసుకురావడంతో పాటు, సిట్‌ ఫిర్యాదుల స్వీకరణ గడువు పెంచాలని సీఎం ను కోరాతామని తెలిపారు. రాజధాని విషయంపై శివరామన్‌ కమిటీ నివేదిక ఇచ్చిందని.. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక బట్టి సీఎం, క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే చర్యలు వుండవు..
హైదరాబాద్ లా ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఉన్నాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టే యోచన లేదని..సీఆర్పీసీ, ఐ పి సీ పరిధిలోనే చర్యలు వుంటాయని తెలిపారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే చర్యలు వుండవని వెల్లడించారు. కులాల వారీగా మీడియా విభజన బాధాకరమన్నారు. జర్నలిస్టులంటే ముఖ్యమంత్రికి గౌరవం వుందని చెప్పారు. చంద్రబాబు వద్ద పొలిటికల్ కాల్ షీట్లు పవన్ తీసుకున్నారని విమర్శించారు. పవన్‌ మాటలు ప్రజలు నమ్మరన్నారు.

పప్పు నాయుడు ఓ పుత్రుడు..పవన్‌ మరో పుత్రుడు..
చంద్రబాబుకు పప్పు నాయుడు ఓ పుత్రుడు అని..పవన్ కల్యాణ్‌ మరో పుత్రుడని ఎద్దేవా చేశారు. లోకేష్ ఐదేళ్లు ఆహార దీక్ష చేసి.. నిన్న ఐదు గంటలు నిరాహార దీక్ష చేశారని.. దీని వల్ల ఫలితం ఉండదన్నారు. పవన్ ప్రజల సమస్యలు తీర్చుతారని ప్రజలు నమ్మి ఉంటే ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్‌ ఉంటుందని.. డివిజన్ రెండూ వుండేలా ప్రధాని మోదీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి హామీ ఇచ్చారని తెలిపారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో పనులు ప్రారంభం కాకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ వైఖరి మారలేదన్నారు. లూలు సంస్థ విశాఖలో నిర్మాణాలు చేపట్టలేదని.. అందుకే ఒప్పందం రద్దు చేసామని వెల్లడించారు. పోలవరం పై కోర్టు తీర్పు సంతోషకరమని, ప్రాజెక్ట్  త్వరగా పూర్తి కానుందని విజయసాయిరెడ్డి తెలిపారు.


 

మరిన్ని వార్తలు