గుంటూరు: రైతుల సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు చేసిన మోసానికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్న గుంటూరులోని నల్లపాడురోడ్డులో వేదికను పార్టీ నేతలతో కలసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. మద్దతు ధర విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నట్టు చెప్పారు. 5 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని విమర్శించారు. అలాగే రైతుల రుణమాఫీ విషయంలోనూ చంద్రబాబు మాట తప్పారని చెప్పారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మొత్తం వడ్డీకి కూడా సరిపోలేదని, ప్రజలు భవిష్యత్లో చంద్రబాబుకు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని విజయసాయి రెడ్డి చెప్పారు. మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్ జగన్ దీక్ష చేపట్టనున్నారు.