29న స్పీకర్‌తో వైఎస్సార్సీపీ ఎంపీల భేటీ

23 May, 2018 03:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌ రావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డిలతో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ ఈ నెల 29న భేటీ కానున్నారు. 29వ తేదీ సాయంత్రం వారు స్పీకర్‌తో ఆమె కార్యాలయంలో సమావేశమవుతారు. ఈ మేరకు స్పీకర్‌ నుంచి వారికి ఆహ్వానం వెళ్లినట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వర్గాలు మంగళవారం తెలిపాయి. ‘ఎంపీల నుంచి రాజీనామాలకు కారణం తెలుసుకునేందుకు వీలు కల్పించే ఒక నిబంధన ఉంది.

మా వివరణతో ఆమె సంతృప్తి చెందితే మా రాజీనామాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది’ అని మిథున్‌ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదాను కల్పించనందుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మార్చి 6న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో వారు నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు భగ్నం చేశారు. 

మరిన్ని వార్తలు