టీడీపీ నేతలకే పరిహారమా?

11 Nov, 2018 07:38 IST|Sakshi

 వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి

శ్రీకాకుళం / ఎల్‌.ఎన్‌.పేట: గత నెల పదో తేదీన విరుచుకుపడిన తిత్లీ తుఫాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఎక్కువ శాతం తెలుగుదేశం నేతలకే పరిహారం అందుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది రైతులు పంటలు, పండ్ల తోటలు నష్టపోయి నిరాశ్రయులుగా మిగిలారని చెప్పారు. ఇళ్లు, పశువుల పాకలు ఎగిరిపోయి ఇప్పటికీ గూడు లేక అనాథలకు చెందాల్సిన పరిహారాన్ని టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రచారంగా మార్చుకునే ముఖ్యమంత్రి భారతదేశంలో చంద్రబాబు ఒక్కరే అని విమర్శించారు. ప్రచారం కోసం ఖర్చు పెట్టిన రూ.కోట్లు బాధితులకు ఇస్తే సంతోషించేవారని ఆమె పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు